వైద్యో నారాయణ హరి అని ఊరికే అనలేదు.కొందరు డాక్టర్లు వైద్యం ను వ్యాపారంగా చూస్తారేమో కానీ చాలామంది వైద్యులు రోగులకు పునరుజ్జీవనం ప్రసాదిస్తారు.అలాంటి అరుదైన సంఘటనే ఇటీవల జరిగింది .ఇది విమానంలో జరగటం ఇంకో విశేషం. అసలేం జరిగింది?
విమానంలో ఓ పాపకు చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరి తీసుకోవడం ఆగిపోయి, శరీరం నీలం రంగులోకి మారిన రెండు నెలల చిన్నారికి ప్రణామ్ హస్పిటల్ డాక్టర్ వైద్యం చేసారు. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి విమానం ఆకాశంలోకి ఎగిరింది. ఇంతలో అందులో ఉన్న ఓ మహిళ తన పాపను పట్టుకొని ఏడుస్తూ ఉంది. అందుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన విమాన సిబ్బందికి.. తన పాప శ్వాస తీసుకోవడంలేదని, ఆమె శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయిందని చెప్పింది.
వెంటనే ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని విమాన సిబ్బంది మైకులో అడగ్గా.. డాక్టర్ మనీష్ ఆ మహిళ వద్దకు వెళ్ళాడు. అనంతరం ఆమె చేతిలోని పాపను తీసుకొని వైద్యం అందించాడు. తర్వాత 5 నిమిషాలకు ఆ పాప శ్వాస తీసుకోవడం ప్రారంభించింది.. అంతేకాకుండా తన శరీరం కూడా తిరిగి మాములు స్థితికి చేరుకుంది. డాక్టర్ మనీష్ ముందే చిన్న పిల్లల డాక్టర్ కావడంతో ఆ చిన్నారికి కావాల్సిన చికిత్సను అందించాడు.
ఈ ఘటన మొత్తాన్ని అక్కడి ప్రయాణికుల్లో ఒకరు సోషల్ మీడియాలో తన స్నేహితులతో పంచుకోగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆ పరిస్థితుల్లో ఆ విమానంలో డాక్టర్ మనీష్ లేకుంటే ..ఊహించుకోడానికే భయం వేస్తుంది కదా?ఏ వైద్యుడైన సాధ్యమైనంతవరకు రోగిని బతికించాలనే చూస్తాడు.కొన్నిసార్లు రోగి పరిస్థితి విషమించి మరణించితే దానికి డాక్టర్లను బాధ్యులుగా చేసి నిందించి గొడవలకు దిగేవారు డాక్టర్ మనీష్ లాంటి వారిని గుర్తుకు తెచ్చుకొని వైద్యులను గౌరవించాల్సిందే!