మాస్కు ధరించలేదని పోలీసులు కొట్టిన దెబ్బలకు మరణించిన చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ ఉదంతంలో మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేయటం కొత్త పరిమాణం.
అయితే ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ఊపందుకుంది. విచారణ కూడా సరైన దారిలో సాగుతోంది . సోమవారం నాటికి కిరణ్ మరణించి రెండు నెలలు అవుతుండగా ప్రభుత్వం ఇప్పటికే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేసింది. కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు కోరినట్లు ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన టు టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ను అరెస్టు కూడా చేశారు. కేసును తారుమారు చేయబోయిన టూటౌన్ సిఐ ఫిరోజ్ ని కూడా బదిలీ చేశారు వారి మరో ప్రధాన డిమాండ్ ఈ కేసులో సెక్షన్ మార్చడం కాగా దానిపైనా పోలీసు శాఖ దృష్టి కేంద్రీకరించింది.
కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు కోరినట్లే ఈ కేసులో ముందున్న దర్యాప్తు అధికారిని మార్చి కొత్త అధికారిని నియమించడం కూడా తెలిసింది. నూతన దర్యాప్తు అధికారి బాల సుందరరావు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి మరీ కొత్త సాక్షులను ఆయన కనిపెట్టి వారి దగ్గర నుంచి రెండు రోజుల క్రితం వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. పోలీసులు కొట్టడం వల్ల కిరణ్ మరణించడమనేది అసలు కారణం కాగా.. తాము అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళుతుండగా అతడు పోలీసు వాహనం నుంచి దూకి గాయపడి మరణించాడన్నది ఖాకీల కథనం! పోలీసులు తమ వాదనకు మద్దతుగా కొ౦దరు ఫేక్ సాక్షులను ప్రవేశపెట్టారు. అయితే కొత్త దర్యాప్తు అధికారి నిష్పాక్షికంగా విచారణ సాగిస్తూ అసలు సాక్షులను గుర్తించారని సమాచారం.ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరుపట్ల కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు సంతృప్తిగానే ఉన్నారు తప్పనిసరిగా తమకు న్యాయం జరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.
అయితే ఈ చావు నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు నాయకులు కిరణ్ తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయటం వంటివి చేస్తున్నారు. కిరణ్ కేసులో సిబిఐ విచారణ కి ఆదేశించాలని కోరుతూ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ దాఖలు చేసిన పిల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు సేకరించింది. మాజీ న్యాయమూర్తి ప్రస్తుత న్యాయవాది శ్రావణ్ కుమార్ ఈ కేసును వాదిస్తున్నారు. అయితే హర్ష కుమార్ ఎందుకు కోర్టుకెక్కారో తమకు తెలియదని కిరణ్ తల్లిదండ్రులు చెప్తున్నారు. చీరాల లోని కొందరు రాజకీయ నాయకులు హర్షకుమార్ ద్వారా ఈ కేసును రాజకీయం చేస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి. అసలు హర్షకుమార్కు ఈ కేసులో ఇంట్రెస్ట్ ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది.టిడిపి ఏవైనా హర్షకుమార్ వెనుక ఉందా అనుమానమూ కలుగుతోంది!