తనకు రిటైరయ్యే ఆలోచన ఏమీ లేదని.. అలాగని ప్రధాని పదవి కూడా అక్కర్లేదని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయితే తాను వెళ్లి ఆయన పక్కనే కూర్చుంటానన్నారు. గతంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన 85 ఏళ్ల దేవెగౌడ ఈ ఎన్నికలలో కర్ణాటకలోని తుమకూరు నుంచి పోటీ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అలా చెప్పినా, ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయక తప్పలేదన్నారు. ఇందులో దాచేందుకు ఏమీ లేదని, తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని చెప్పారు. రాజకీయాల నుంచి మాత్రం తాను రిటైర్ అయ్యేది లేదని స్పష్టంచేశారు.
తన తండ్రి ప్రధాని అభ్యర్థిత్వానికి ఏకాభిప్రాయం ఉందని కర్ణాటక సీఎం కుమారస్వామి గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు. దీనిపై దేవెగౌడ స్పందించారు. ‘‘మోదీ మళ్లీ పార్లమెంటుకు రాకూడదన్నదే నా లక్ష్యం. ఈ విషయం ఆయన ముఖమ్మీదే చెప్పడానికి కూడా నాకు దైర్యముంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే నేను వెళ్లి ఆయన పక్కనే కూర్చుంటా. ప్రధానమంత్రే అవ్వాల్సిన అసవరం లేదు’’ అని చెప్పారు. తమది చిన్న పార్టీ అయినా తమతో పొత్తుకు సోనియా అంగీకరించారని, అందువల్ల ఇపుడు కాంగ్రెస్ కు మద్దతివ్వాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. తాను ముందుగా పార్టీని, తర్వాత కార్యాలయాన్ని కాపాడుకుంటానని దేవెగౌడ అన్నారు. కానీ పార్టీ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలపై ప్రశ్నించగా, తన కుటుంబ సభ్యులెవరినీ ఇంతవరకు పార్టీ అధ్యక్షులు కానివ్వలేదని గుర్తుచేశారు. తనతో కలిసి పనిచేసిన వారిలో కొందరు కాంగ్రెస్ లోను, కొందరు బీజేపీలోను ఉన్నారని.. పార్టీని బలంగా ఉంచేందుకు తాను చాలాసార్లు ఇబ్బంది పడ్డానని అన్నారు.