కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డు షో జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనలో 8 మంది కార్యకర్తలు మృతి చెందడం, మరి కొందరు కార్యకర్తలు గాయపడటంతో అధికార వైసీపీ విమర్శలకు దిగింది. చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ఘటన జరిగిందని నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. స్థానికులు చంద్రబాబు రోడ్ షో కు రాకపోవడంతో చంద్రబాబు తనతో జనాలను తీసుకువచ్చారని విమర్శించారు. ఎనిమిది మంది అమాయకులు మరణానికి చంద్రబాబే కారణమనీ, కావాలనే ఇరుకు రోడ్లలో రోడ్ షో నిర్వహించారని కాకాని మండిపడ్డారు.
పేదల ప్రాణాలకు చంద్రబాబు వెల కడుతున్నారని కాకాని విమర్శించారు. డ్రోన్ షాట్ ల కోసం 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు. లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం వల్లే కందుకూరు ఘటన జరిగిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని బాబుతో ఇదేమి ఖర్మ అని జనం అనుకుంటున్నారని మంత్రి కాకాని విమర్శలు గుప్పించారు. జగన్ సభలకు ఎంత మంది వచ్చినా ఎక్కడా ఒక అపస్తృతి జరగలేదని అన్నారు. గతంలో పుష్కరాల సమయంలోనూ 29 మంది మృతికి కారణమయ్యారని మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు పెట్టారనీ, టీడీపీ నేతల నిర్వాకం వల్లనే 8 మంది అమాయకలు బలి అయ్యారని కందుకూరు ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారని అన్నారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తే జనం బుద్ది చెబుతారని ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి హెచ్చరించారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని పేర్కొన్నారు. తక్కువ జనాలను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు బాలినేని. చంద్రబాబు అధికార వ్యామోహాన్ని తగ్గించుకుంటే మంచిదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హితవు పలికారు. విజన్ గురించి మాట్లాడే చంద్రబాబుకు అసలు విజనే లేదని అన్నారు. పుష్కరాల్లోనూ పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలిగొన్నారని గుర్తు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కందుకూరు ఘటన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.