Vallabhaneni Janardhan: టాలీవుడ్ లో మరో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించగా.. ఇప్పుడు మరో సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన వల్లభనేని జనార్ధన్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈరోజు తుది శ్వాస విడిచారు.
ప్రముఖ దర్శక, నిర్మాత విజయబాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరిని జనార్ధన్ వివాహమాడారు. పెద్దల సమక్షంలో జరిగిన ఈ వివాహ బంధంతో వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు. అయితే మొదటి కుమార్తె శ్వేత చిన్నతనంలోనే చనిపోగా రెండవ కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్. కొడుకు అవినాష్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
వల్లభనేని జనార్ధన్ సినిమా నటుడిగా రాకముందే ఆయన మామ్మ గారి మనవలు సొంత నిర్మాణ సంస్థ స్థాపించారు. ఆయన 21 ఏళ్ల వయసులోనే కన్నడ హిట్ సినిమా మానససరోవరం ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి అనే సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. ఆ తరువాత శోభన్ బాబు హీరోగా హిందీలో తెరకెక్కిన బసేరాను తెలుగులో తోడునీడగా రిలీజ్ చేశారు. వల్లభనేని జనార్ధన్ విజయబాపినీడు దర్శకత్వంలో అనేక సినిమాల్లో నటించారు. చిరంజీవి హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ లో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్ధన్ నటించి అందరినీ మెప్పించారు.
వల్లభనేని జనార్ధన్ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన చిరంజీవితో అనేక సినిమాల్లో నటించిన జనార్దన్ బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, నాగార్జునతో వారసుడు, వెంకటేష్ తో సూర్య ఐపిఎస్ వంటి సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత లాంటి సీరియల్స్ లో నటించారు.