23 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసు కోవడానికి విశ్వప్రయత్నాలలో ఉన్న వైసీపీకి ఒక్క టిడిపి ఎమ్మెల్యే మాత్రం లొంగే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు ఘంటాపదంగా చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ ,కరణం బలరాం, మద్దాలి గిరి లను వైసిపి ఆకర్షించేసింది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఆ జాబితాలో ఉన్నారని వినికిడి.
అయితే వైసీపీ తలకిందులుగా తపస్సు చేసిన తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాత్రం వైసీపీ గాలానికి చిక్కబోరని పరిశీలకులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో మండపేటలో వేగుళ్ల వైసిపి గాలిని తట్టుకొని జగన్ కు అత్యంత సన్నిహితుడైన పిల్లి సుభాష్ చంద్ర బోస్ ను ఓడించారు. తదుపరి పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకి మండపేట బాధ్యతలను జగన్ అప్పగించారు. ప్రస్తుత౦ త్రిమూర్తులు మండపేటలోనే పని చేసుకుంటున్నారు.
అయినా వేగుళ్లను కూడా లాగేసుకు౦టే ఒక పని అయిపోతుందన ఆలోచనలో వైసిపి ఉందంటున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు మండపేట లో గెలిచిన జోగేశ్వరరావు అపారమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఆ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కమ్మ, శెట్టిబలిజ సామాజిక వర్గాలు జోగేశ్వరరావుకి పెట్టనికోట. త్రిమూర్తులకు శెట్టిబలిజలు పూర్తిగా వ్యతిరేకం. కమ్మ ఓట్లు ఎలాగు వైసీపీకి పడవు. ఈ పరిస్థితుల్లో మండపేటలో త్రిమూర్తులు అగలేరని ,జోగేశ్వరరావు అయితే సరిపోతుందని వైసిపి వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కానీ జోగేశ్వరరావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టిడిపిని వీడరన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఈ వ్యవహారాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.