అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రానైట్ గనులపై తనిఖీలు…!
మూడు జిల్లాల అధికారు.., పన్నెండు బృందాలు, విపరీత తనిఖీలు…!!
నాలుగు నెలల పాటు అన్ని లెక్కలు తీసి రూ. 2100 కోట్లు ఫైన్ వేశారు…!!
వహ్వా జగన్ అంటే మాటలా..? వైసిపి ప్రభుత్వం అంటే మాటలా…?? అవినీతిపై ఉక్కుపాదం మోపేసారు. గ్రానైట్ లో అవినీతిని బట్టబయలు చేసారు. ఇక ప్రభుత్వానికి ఆ అవినీతి డబ్బు జమ అయినట్టే అనుకున్నారు….!!
నెల గడిచింది. ఒక్కరూ, ఒక్క రూపాయి ఫైన్ కట్టలేదు…!
రెండు నెలలు గడిచింది, ఒక్కరూ ఒక్క రూపాయి ఫైన్ కట్టలేదు…!
మళ్ళీ నోటీసులు వెళ్లాయి. కొందరు జడిసారు. బెదిరారు. తమ అవినీతి మూలాలు కదిలినట్టే అనుకుని బెంగ పెట్టేసుకున్నారు…! అంతర్గత చర్చలు ఆరంభించారు…!
మూడు నెలలు గడిచింది. ముగ్గురు కండువాలు మార్చేసుకున్నారు. రాజకీయంగా ఎందుకూ
పనికిరాని, ఎక్కడా వెలుగు లేని శిద్ధా సోదరులు ఇద్దరితో సహా…., చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ పార్టీ మారిపోయారు. నాలుగు నెలలు గడిచింది. ముగ్గురు కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో నలుగురు వెళ్లి బేరం మాట్లాడుకున్నారు. ఫలితం ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఫైన్ జమ కాలేదు.
చీకటి బేరాలు… అనేక ఆరోపణలు…!!
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి కొన్ని వాస్తవాలు మాత్రమే. కానీ దీనిలో కొన్ని ఆరోపణలు, చీకటి బేరాలు, పుకార్లు, ప్రచారాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెప్పుకోవాలి.
* ఓ గ్రానైట్ క్వారీకి రూ. 205 కోట్లు ఫైన్ వేశారు. ఆయన బేరానికి వెళ్లి, కాళ్ళా, వేళ్ళా వెళ్తే, బతిమాలాడుకుంటే… ఓ కీలక నాయకుడికి క్వారీలో వాటా ఇవ్వమని బేరం కుదిరిందని ఒక పుకారు నడుస్తుంది. అక్కడితో ఆ క్వారీ సేఫ్.
* మరో ఇద్దరు క్వారీ యజమానులు ఓ మంత్రి ద్వారా సీఎం సన్నిహితులతో మాట్లాడి.., చీకటి ఒప్పందాలు చేసుకున్నారని మరో ప్రచారం. ఈ రెండు క్వారీలకు రూ. 450 కోట్లు ఫైన్ వేయగా… ఇవి ఇప్పుడు మరింత అదనంగా తవ్వకాలు జరుగుతున్నాయి.
* ఓ కీలక క్వారీ వ్యాపారి, మాజీ మంత్రి ఒకరు..! ఇటీవల వైసిపి లో చేరిపోయారు. దీనిలో ఓ మంత్రి, ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించారు. అందుకు ప్రతిఫలంగా ఇద్దరు నాయకులకు కొంత సమర్పించుకున్నారు. పార్టీ మారిన ఒక్క రోజు వ్యవధిలో ఆయన క్వారీ తవ్వకాలు మళ్ళీ మొదలయ్యాయి. రెండో రోజుకి ఆయనకు ఇద్దరు గన్ మెన్ లు వచ్చి చేరిపోయారు.
* మరో కీలక గ్రానైట్ వ్యాపారి. ఓ ఎమ్మెల్యే కూడా. ఈయన అధికార పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేసినా సీఎం దగ్గర ప్రయత్నాలు ఆగాయి. ఇక చేసేదేమి లేక… అధికారికంగా కోర్టుల ద్వారా పోరాడుతున్నట్టు… అనధికారికంగా ఓ మంత్రి ద్వారా లావాదేవీలు నడిపిస్తున్నట్టుగా ప్రచారం ఉంది.
ఇప్పుడు మరిన్ని వాస్తవిక ప్రశ్నలు..??
ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది గడిచింది. గ్రానైట్ తనిఖీలు పూర్తి చేసి, ఫైన్ లు వేసి దాదాపు 8 నెలలు గడుస్తుంది. ఏమయ్యింది…? ఈ తనిఖీల ద్వారా ప్రభుత్వం ఏం సాధించినట్టు..? సీఎం జగన్ ఏం సాధించినట్టు..? ఆ జిల్లా మంత్రి ఏం సాధించినట్టు..? ముందు నుండి గ్రానైట్ లో భారీగా అవినీతి జరిగిపోతుంది అంటూ మీటింగులు పెట్టిన ఆ స్థానిక ఎమ్మెల్యే ఏం సాధించినట్టు…? అసలు గ్రానైట్ క్వారీల్లో తనిఖీల ద్వారా ప్రజలకు, తనను నమ్మిన వారికి సీఎం జగన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు…?? ఒక్క రూపాయి ఫైన్ వేయకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రజలు ఏమనుకోవాలి…? ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అన్నిటికీ ఒక్కటే సమాధానం. గ్రానైట్ అవ్వనీ, గ్రానైట్ కి అమ్మమ్మ అవ్వనీ… జగన్ కనుసన్నల్లోనే ఉండాలి. అది నీతి వ్యవహారమా, అవినీతి వ్యవహారమా అనేది తర్వాత సీఎం జగన్ కు గ్రానైట్ క్వారీల విషయంలో ఒక స్పష్టత ఉంది. దాని ప్రకారమే ఈ చర్యలు, చేరికలు, లావాదేవీలు, వ్యవహారాలూ.., అన్నీను.