ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్ది ఇసుక సరఫరా విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకోగా ఇకపై ఇసుక రీచ్ ల దగ్గర ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే క్రమంలో ఆయన రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ ను వినిపించారు. గ్రామాల్లో ఉన్న వారు తమ సొంత అవసరాలకోసం ఎడ్లబండి ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా ఇసుకను తెచ్చుకోవచ్చని సీఎం తెలిపారు.
అలాగే ఇకపై గ్రామ మరియు వార్డు సచివాలయం లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించిన ఆయన నియోజకవర్గం మొత్తానికి ఇసుక రేటు ఒకటటే ఉండాలని స్పష్టం చేశారు. జూన్ చివరి నాటికి రోజుకి మూడు లక్షల టన్నుల ఇసుక నిల్వలు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించిన జగన్…. రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ లు అన్నింటినీ తెరవాలని అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలని చెప్పిన ముఖ్యమంత్రి రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని మరియు కొత్త సోర్స్ లను గుర్తించి అక్కడ కూడా రీచ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. దీనికి సంబంధించి జాయింట్ కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపిన ఆయన ప్రతి ఒక్క చర్య కలెక్టర్ల పర్యవేక్షణలో జరగాలన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల కానుండగా బుకింగ్ అనుమతులను కూడా జాయింట్ కలెక్టర్ చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం విధానం పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా దీనికి సంబంధించిన ఎస్ఓపి రేపటి నుండి అమలులోకి వస్తుంది.