అమరావతి, ఫిబ్రవరి 27: చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైసిపిలో చేరారు.
టిడిపికి రాజీనామా చేసిన ఆమంచి ఇటీవల వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పార్టీలో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు.
బుధవారం తాడేపల్లిలో నూతనంగా ప్రారంభించిన వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆమంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆమంచితో పాటు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, వెంకటేశ్వరరావుల కుమారుడు దగ్గుబాటి హితేష్ కూడా వైసిపిలో చేరారు.
ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చకుండా పోరాటం సాగిస్తున్న వైఎస్ జగన్తో పని చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.