BJP : దేశ రాజకీయ భవిష్యత్తుని మారుస్తాయనే నమ్మకమున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు నేటితో ఆరంభం కాబోతున్నాయి. అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 27 వరకు జరగనున్నాయి. ఆపై మే రెండో తేదీన ఫలితాలు వస్తాయి. అయిదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి, అస్సాం పక్కన పెడితే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం దేశ రాజకీయ భవిష్యత్తుకి కొత్త కథలు నేర్పించనున్నాయి. ఈ రాష్ట్రాల్లో పాగా వేసి దేశం మొత్తం కాషాయమయం చేసెయ్యాలి అనుకున్న బీజేపీకి ఇక్కడి ఓటర్లు లొంగేలా కనిపించడం లేదు. ఒకవేళ అదే జరిగితే.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓడితే మాత్రం ప్రాంతీయ పార్టీలకు ఊపొచ్చినట్టే. బీజేపీపై గట్టి వ్యతిరేక వాయిస్ పైకి లేచినట్టే..!
BJP : పశ్చిమ బెంగాల్ లో అన్ని రకాలుగా బరిలోకి..!!
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు బీజేపీకి ప్రత్యేకం. ప్రస్తుతం బీజేపీకి అత్యంత గట్టి ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే ఆమె మమతా బెనర్జీ మాత్రమే. అందుకే బెంగాల్ లో ఆమెని ఓడించి.. తమ రాజకీయ శత్రువులకు సంకేతాలు ఇవ్వాలనుకుంటున్న బీజేపీ అక్కడ చాలా ప్రయత్నాలే చేసింది. మమతకు దగ్గరగా ఉండే ముస్లిం ఓట్లు చీలిక వచ్చేలా ఎంఐఎం బరిలోకి దిగింది. కాంగ్రెస్ లో జిల్లాస్థాయిలో పట్టున్న నేతలను బీజేపీ చేర్చుకుంది. తృణమూల్ కాంగ్రెస్ లో కూడా మమతకు అత్యంత సన్నిహిత నేతలు ఇద్దర్ని బీజేపీ తమతో చేర్చుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా నేరుగా ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల వ్యూహాల్లో, పోల్ మేనేజ్మెంట్ లో పాల్గొన్నారు. ఆయన సొంత టీమ్ 80 మందిని 120 రోజుల పాటూ అక్కడే ఉంచారు. అన్ని రకాల సర్వేలు, పన్నాగాలుతో ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. కానీ అక్కడ మమతకు అవకాశాలున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. పీకే ఆమెకు అదనపు బలం.
తమిళనాట సంప్రదాయమే..!?
ఇక తమిళనాడు ఎన్నికల్లో ఎప్పుడూ సంప్రదాయం తప్పదు. అక్కడ రెండు ప్రధాన పార్టీలు ఉండగా… ఒకసారి ఒక పార్టీ అధికారం చేపడుతుంది. కానీ… తొలిసారిగా 2011 లో గెలిచిన అన్నా డీఎంకే మళ్ళీ 2016 లో కూడా గెలిచింది. వరుసగా రెండుసార్లు గెలవడం అరుదు. అందుకే మూడోసారి మాత్రం అవకాశాల్లేవు అంటున్నారు. అక్కడ సర్వేలు, రాజకీయ నిపుణులు, కీలక నేతలు స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే దే అధికారం అంటున్నారు. ఇక్కడ అన్నా డీఎంకే కి బీజేపీ మద్దతుగా ఉండగా., డీఎంకేకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ మంచి గెలుపు అందుకోగా.. ఇప్పుడు కూడా అదే ఊపుతో ఉంది. అన్నా డీఎంకే కి నిధులు, ఎన్నికల ప్రణాళికలు, తెరవెనుక సపోర్ట్ అన్ని అందించినప్పటికీ ఈ రాష్ట్రంలో బీజేపీకి కష్టమే.
కేరళలో లెఫ్ట్ ని కాదనలేరు..!?
కేరళ సంగతి దాదాపు ఇలాగే ఉంది. ఇక్కడ లెఫ్ట్ ని దాటి కాంగ్రెస్ కి తప్ప మరొకరికి అధికారం రావడం లేదు. అయితే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి అవకాశం ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. కాకపోతే ఇక్కడ 2016 లో అధికారం చేపట్టిన లెఫ్ట్ పినరయి విజయన్ పాలనపై సంతృప్తి ఉండడంతో మళ్ళీ వాళ్లదే అధికారం అని సర్వేలు చెబుతున్నాయి. 2016 ఎన్నికల్లో లెఫ్ట్ 91 స్థానాలు.., కాంగ్రెస్ 47 స్థానాలు.., బీజేపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి. ఒక్క సీటు నుండి అమాంతం 71 స్థానాలు గెలిచేసి అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ కల సార్ధకం కావడం అసాధ్యమే. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ అధికారం, బీజేపీ ప్రతిపక్షం దక్కించుకునే అవకాశాలున్నాయి. తొలిసారిగా కాంగ్రెస్ మూడోస్థానానికి చేరనుందని సర్వేలు చెప్తున్నాయి…!!