Chandrababu Naidu: ఎవరు అవునన్నా.. కాదన్నా.. రాష్ట్రంలో రాజకీయాలు సామాజిక సమీకరణాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కులాల మీదనే రాజకీయాల కాపురాలు ఆధారపడి ఉంటాయి..! ప్రతి పార్టీ కూడా తాము సామాజిక న్యాయం చేస్తాం అని, సామాజిక పరంగా అది చూస్తాం, ఇది చూస్తాం అనే చెబుతుంటాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఒక స్ట్రాటజీ ప్రకారం కాపు సామాజికవర్గం, అలానే మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ అయిదు సామాజికవర్గ నేతలకు ఉప ముఖ్యమంత్రుగా నియమించుకున్నారు.
ఎందుకంటే తాము సామాజిక న్యాయం చేస్తున్నామని బయటకు చెప్పుకోవడం కోసం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రకరకాల వారికి రకరకాల పోర్టు పోలియోలు ఇచ్చారు. వారిని ప్రోత్సహించారు. కానీ ఇక్కడ వైసీపీ అభిమానులు గానీ, టీడీపీ అభిమానులు గానీ ఆలోచించాల్సింది ఏమిటంటే .. ఎవరు మంత్రులుగా ఉన్నా, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నా వీళ్లంతా సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) కంట్రోల్ లో ఉండాల్సిందే. ఈ అత్యంత కీలకమైన స్విచ్చులు మొత్తం కంట్రోల్ చేసే సీఎం కార్యాలయంలో ఏ సామాజికవర్గం వాళ్లు ఉన్నారు అనేది ఆలోచించాలి..!? ప్రస్తుతం అక్కడ (సీఎంఓ) ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, కె. నారాయణరెడ్డి తదితరులు..! ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైతే సుజనా చౌదరి, టీడీ జనార్దన్, వీవీవీ చౌదరి తదితరులు చక్రం తిప్పుతుంటారు..! అప్పుడు గానీ, ఇప్పుడు గానీ స్టీరింగ్ కంట్రోల్ మాత్రం వారి సామాజికవర్గం చేతిలోనే ఉంటుంటాయి..!
Chandrababu Naidu: ఆ వర్గానికి బాబు పూర్తిగా అన్యాయం..!?
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు ఒక సామాజికవర్గానికి అసలు టికెట్ లు ఇవ్వకుండా దూరం చేసుకున్నారు అనేది వాస్తవం. ఇది అందరూ అంగీకరించాల్సిన అంశం. రాష్ట్రంలో 2.8 శాతం నుండి 3 శాతం వరకూ ఓటు బ్యాంకు ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదే ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాలు బ్రాహ్మణ సామాజికవర్గానికి ఇచ్చింది. కోనా రఘుపతి (బాపట్ల), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్), విశాఖపట్నం నుండి ద్రోణంరాజు శ్రీనివాస్, విజయ నిర్మలకు జగన్ టికెట్లు ఇచ్చారు. అయితే వీరిలో విశాఖ నుండి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్, విజయ నిర్మల పరాజయం పాలైయ్యారు మల్లాది విష్ణు, కోన రఘుపతి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
* టీడీపీ మాత్రం ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదు. 2014 నుండి 2019 వరకూ కూడా టీడీపీ అధికారంలో ఉండగా బ్రాహ్మణ సామాజికవర్గాన్ని పట్టించుకోవడం లేదన్న వాదన కూడా ఉంది. టీడీపీ హయాంలో రిటైర్డ్ ఐవైఆర్ కృష్ణారావు ఆద్వర్యంలో బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ వర్గాల్లో అసంతృప్తి ఉంది. దానికి తోడు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆ సామాజికవర్గానికి కేటాయించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ బ్రాహ్మణ సామాజికవర్గం వైసీపీకి మద్దతు పలికింది. అయితే ఇప్పుడు ఆ సామాజికవర్గం టీడీపీ నుండి రెండు అసెంబ్లీ స్థానాలు ఆశిస్తుంది. బ్రాహ్మణ సామాజికవర్గ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ సీట్లను ఆ పార్టీలోని బ్రాహ్మణ సామాజికవర్గ నేతలు కోరుతున్నారు. టీడీపీలో దశాబ్దాల తరబడి యాక్టివ్ గా ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు ఈ సీట్లపై పట్టుబడుతున్నారు. బ్రాహ్మణులను విస్మరించిన విషయాన్ని చంద్రబాబుకు వారు గుర్తు చేస్తున్నారు.
ఓట్లు ఎక్కువే.. కానీ..!?
నిజానికి రాష్ట్రంలో బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, ఆర్యవైశ్య సామాజికవర్గం సమాన ఓటు బ్యాంకు ఉంటుంది. ఒక్కో సామాజికవర్గానికి 10 నుండి 12 లక్షల ఓటు బ్యాంకు ఉంటుంది. వేరే సామాజికవర్గాలకు రెండు మూడు సీట్లు ఇస్తున్నారు, మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు. వెలమ, క్షత్రియ, ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యతను ఇస్తూనే ఉన్నారు. కానీ బ్రాహ్మణ సామాజికవర్గానికి టీడీపీలో ఇవ్వడం లేదని కొత్తగా తెరపైకి వచ్చిన వాదన. దీన్ని చంద్రబాబు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు. దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుని పరిష్కరించుకుంటారు అనేది కీలకం. ఇదే సమయంలో సీఎం జగన్ మాత్రం అన్ని వర్గాలకు సీట్లు కేటాయింపు విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు..!