YS Jagan Chiru: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవో జారీ చేయటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన తాజా ధరలు సినీ వర్గాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది. గరిష్టంగా రెండు వందల యాభై రూపాయలు కనిష్టంగా 20 రూపాయలు… నిర్ణయించడంతో.. పాటు ఐదవ షోకి అనుమతి ఇవ్వటంతో ఇండస్ట్రీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిలోభాగంగా మెగాస్టార్ చిరంజీవి… ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి సోషల్ మీడియా వేధికిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ” తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా.. అటు థియేటర్ల మనుగడను.. ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికేట్స్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి.
పరిశ్రమ తరపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు.. పేర్ని నాని గారికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు ” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. గతంలో చిరంజీవి సినిమా టికెట్ల ధరల విషయంలో ఇండస్ట్రీ సమస్యల విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయి సమస్య-పరిష్కారం అవ్వటానికి సామరస్య వాతావరణంలో నిలిచారు.
ఆ తర్వాత టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు లతో పాటు టాప్ డైరెక్టర్లు కొరటాల శివ, రాజమౌళి ఇంకా ఇండస్ట్రీకి చెందిన ఆలీ, పోసాని కృష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి లతో… కలిసి సీఎం వైఎస్ జగన్ తో చర్చించి… టికెట్ ధరల విషయంలో ఓ కొలిక్కి పరిష్కార మార్గం చూపే దిశగా చిరంజీవి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇస్తూ.. టికెట్ ధర పెంచటంతో ఇండస్ట్రీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.