మీకు గుర్తుందా? తెలంగాణ సీఎం కేసీఆర్.. 2019 ఎన్నికలకు ముందు.. అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి తృతీయ ఫ్రంట్ అంటూ ఏర్పాటు చేసి.. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా తృతీయ ఫ్రంట్ అధికారంలోకి రావాలని ఎంతో ప్రయత్నించారు. అంతేనా.. దేశంలో ఉన్న పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి కూడా వచ్చారు. కొందరు ఆయన తృతీయ ఫ్రంట్ కు మద్దతు ప్రకటిస్తే.. మరికొందరు సింపుల్ గా నో అన్నారు. మొత్తం మీద ఇదంతా గమనిస్తే సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది. అక్కడ కూడా చక్రం తిప్పాలనుంది. అందుకే.. ఆయన ఎప్పటి నుంచో మంచి అవకాశం ఎదురు చూస్తున్నారు.
నిజానికి తెలంగాణ సీఎంగా ఇంకా కొనసాగడం కేసీఆర్ కు ఇష్టం లేదు. అక్కడ ఎలాగూ తన కొడుకు ఉన్నాడు. ఇఫ్పటికే ఓ టర్మ్ ముఖ్యమంత్రగా చేసిన కేసీఆర్.. ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని తన కొడుకుకు అప్పగించి.. మెల్లగా జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేయాలని చూస్తున్నారు.
కానీ.. సరైన సమయం రావాలి కదా. ఆయన జాతీయ రాజకీయాల గురించి మళ్లీ మాట్లాడింది లేదు కానీ.. ఓబీజేపీ నేత కేసీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయన ఎవరో కాదు.. మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్. వివేక్ ఏమన్నాడంటే… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో వేలు పెట్టాలనుకుంటున్నారు. కేంద్రంలో ఉప ప్రధాని పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.. అంటూ వివేక్ చెప్పుకొచ్చాడు.
అంతే కాదు.. కేటీఆర్ ను సీఎం చేసి.. ఏపీ సీఎం జగన్ పార్టీ ఎంపీల బలంతో కేంద్రంలో ఉప ప్రధాని పీఠాన్ని అధిరోహించానల్నదే కేసీఆర్ లక్ష్యం అంటూ బాంబు పేల్చాడు. అంతేనా… దాని కోసమే జగన్ కు మద్దతు ఇస్తున్నారు. ముందు నుంచి జగన్ తో ఫ్రెండ్ షిప్ చేసేది అందుకే. కావాలనే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కూడా కేసీఆర్ మాట్లాడటం లేదు.. అంటూ వివేక్ ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ ఎంపీల మద్దతు కోసం కేసీఆర్ ఏకంగా తెలంగాణ ప్రజలనే మోసం చేస్తున్నారు.. అంటూ వివేక్ ఆరోపించారు.
ఓకే.. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. అసలు.. ఇప్పుడు ఉప ప్రధాని స్థానాన్ని భర్తీ చేయాల్సిన అత్యవసర పరిస్థితి కేంద్రంలో ఉందా? అంటే లేదు.. అసలు ప్రధాని మోదీకి ఉప ప్రధాని పోస్టును భర్తీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా.. పోయి పోయి.. కేసీఆర్ ను తీసుకొచ్చి ఉప ప్రధానిని చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటారా మోదీ?.. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. కాకపోతే.. ఓ బీజేపీ నాయకుడే ఈ వ్యాఖ్యలు చేశాడంటే.. నిజంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పావులు కదుపుతున్నాడా? అన్న అనుమానం కలుగుతోంది.
మరోవైపు నుంచి ఆలోచిస్తే… సీఎం కేసీఆర్.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేశాక.. తెలంగాణలో ఉండి చేయాల్సిన పనులేం ఉండవు. తెలంగాణను కేటీఆర్ చూసుకున్నాక.. కేసీఆర్ ఏం చేయాలి. అందుకే.. ఎలాగైనా కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి.. జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టాల్సిందేనన్న ఉద్దేశంతో కేసీఆర్ ఢిల్లీ వైపు చూస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఏది నిజమో? ఏది అబద్ధమో? ఆ దేవుడికే తెలియాలి.