రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఓడలు బండ్లు కావచ్చు.. బండ్లు ఓడలు కావచ్చు. రాత్రికి రాత్రే మారే రాజకీయాలు ఇవి. ఎంతమందిని చూసుంటాం.. రోజుకో పార్టీ మార్చే నాయకులను. ఏ నాయకుడికైనా కావాల్సింది అధికారం, డబ్బు, పలుకుబడి. వీటి కోసమే నూటికి తొంబైతొమ్మిది మంది రాజకీయాల్లోకి వస్తారు. ఎవరో నూటికో కోటికో ఒక్కడు ప్రజల కోసం వస్తాడు. అలాంటి నాయకులు ఈ రోజుల్లో ఉన్నారో లేరో ప్రజలకే తెలుసు.
ఇక.. అసలు విషయానికి వస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్నట్టుండి బీజేపీ నేతలకు ప్రేమ పుట్టుకొస్తున్నది. ఎంతలా అంటే.. ఏకంగా ప్రెస్ మీట్లలో పొగిడేంత. అవును.. ఒకప్పుడు వైసీపీ, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ఎండుగడ్డి వేసినా భగ్గుమనడం లేదు. ఎందుకంటే.. వాళ్లు కలిసిపోయారు. మనం మనం భాయ్ భాయ్.. దోస్తులం.. హే దోస్త్ కీ.. అంటూ పాటలు పాడుకుంటున్నారు.
నిజానికి బీజేపీ నేతలు జగన్ ను ప్రశంసించడం అదేని జగన్ కు మంచి పరిణామమే. ఎందుకంటే.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అందులోనూ జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ.. ఆ తర్వాత ఆ రెండు పార్టీలు కలిసి చేసిందయితే ఏం లేదు.
వైఎస్సార్సీపీపై బీజేపీ బాగా ఫైర్ అయింది అంటే బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడే. ఇప్పుడు సీన్ మారిపోయింది. సోము వీర్రాజు ఎప్పుడైతే బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడో.. అప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్కు టీడీపీ నుంచి మాత్రమే విమర్శలు వస్తున్నాయి.
ఆన్ లైన్ జూదాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంతో..
ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ జూదాన్ని రద్దు చేసింది. దీంతో బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి..జగన్ సర్కరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. చాలాకాలం నుంచి బీజేపీ కూడా ఇదే డిమాండ్ చేస్తుంది.. అదే వేరే విషయం కానీ.. ఏకంగా బీజేపీ ఉపాధ్యక్షుడే జగన్ ను పొగిడేసరికి ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.
అంతేనా… ఏపీలో ఎండీవోలకు ఎటువంటి ప్రమోషన్ లేకుండా రిటైర్ కావాల్సి వస్తోందట. అందుకే… వాళ్లను డీడీవోలుగా ప్రమోట్ చేయాలంటూ… సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని కోరడం.. జగన్ కూడా వాళ్ల డిమాండ్ కు ఓకే చెప్పడంతో…బీజేపీ కూడా ఫుల్లు ఖుషీ అవుతోంది.
మరోవైపు… బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా సీఎం జగన్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు. టీటీడీకి సంబంధించిన ఆదాయవ్యయ రిపోర్టును కాగ్ విచారణకు ఇవ్వాలంటూ ఎంపీ జగన్ సర్కారును కోరారు. దీంతో జగన్ కూడా వెంటనే ఆ రిపోర్టును కాగ్ కు అందించారు. దీంతో సుబ్రహ్మణ్య స్వామి కూడా జగన్ ను మెచ్చుకున్నారు.
ఇలా.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రముఖులు జగన్ ను ప్రశంసల ముంచెత్తుతున్నారంటే.. ప్రధాని మోదీకి కూడా జగన్ అంటే ఇష్టమే కాబోలు అని అంటున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ.. జగన్ ప్రేమలో పడిపోయినట్టున్నారు.. అంటూ రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.