దేశ వ్యాప్తంగా హిందువులు కలగన్న అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అంతా సాఫీగా సాగిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని హిందువులు ఇప్పటికీ పండగ చేసుకుంటున్నారు. అయోధ్య లో ప్రజలు అయితే ఆనందోత్సవాలలో మునిగిపోతున్నారు. దేశ వ్యాప్తంగా హిందువులు అయోధ్య రామ మందిర కల సాకారం అవుతుండటంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగున్నా అయోధ్య రామ మందిర శంకుస్థాపన ఇప్పుడు చిన్న వివాదానికి దారి తీసింది. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? సమాధాన పర్చాల్సింది ఎవరు? నిజానికి దీనికి సమాధానం ఇవ్వరు. ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్లే బీజేపీ లో ఉన్నారు. అసలు ఆ వివాదం ఏమిటి అని చూస్తే…
ఆర్ ఎస్ ఎస్ అధికారికం అయిపోయిందా?
అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన వేడుకకు అధికారికంగా హాజరైనది ఐదుగురు. వారిలో ప్రధాన మంత్రి మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, అలాగే అయోధ్య ఆలయ ట్రస్ట్ చైర్మన్ మహంత నృత్యగోపాల్ దాస్ ఈ నలుగురు అధికారికంగా హోదా ప్రకారం హాజరయ్యారు. ఈ నలుగురితో పాటు వేదికను పంచుకున్న అయిదవ వ్యక్తి ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆయనకు ఏమి సంబంధం. దేశ వ్యాప్తంగా ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి ఎల్ కె అద్వానీ కంటే, మురళీ మనోహర్ జోషి కంటే, బీజేపీ పెద్దలు ఎంతో మంది కంటే, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కంటే ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అధిక ప్రాధాన్యత లభించిందా?. అంటే బిజెపి శక్తులు గానీ ఆర్ ఎస్ ఎస్ శక్తులు గానీ అవుననే సమాధానం చెప్తాయి. నిజానికి అక్కడ ఉన్న నలుగురి కంటే ఎక్కువ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కే ప్రాధాన్యత, ప్రధమ తాంబూలం లభిస్తుంది. బీజేపీ వాళ్లకు, ఆర్ ఎస్ ఎస్ వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. ఇదే ఇప్పుడు వివాదాస్పద అంశంగా మారింది. అయితే దీన్ని ఎవరు ప్రశ్నించారు. నిలదీయరు. నిలదీసే ధైర్యం కూడా ఎవరు చేయరు. అదే బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ప్రత్యేకత.