హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం శంకుస్థాపనకు ప్రధాని మోడీ వెళ్ళటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే టైమ్ లో ప్రజాస్వామ్య మరియు లౌకిక విలువలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తూ పదవి లోకి వచ్చి, ఇప్పుడు రాజ్యాంగ విలువలను ధిక్కరించారు అని మండిపడ్డారు.
అంతేకాకుండా పునాది రాయి వేసిన అనంతరం తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనైన ప్రధాని వ్యాఖ్యలు విని తాను కూడా ఈ దేశ పౌరుడిగా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాను అని ఓవైసీ అసదుద్దీన్ పేర్కొన్నారు. కారణం నాలుగు వందల యాభై ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో ముస్లింలు ఎంతో పవిత్రంగా ప్రార్థనలు చేశారు, అలాంటి ప్రాంతంలో ఆర్.ఎస్.ఎస్, బజరంగ్ దళ్ సభ్యులు వి.ఎస్.పి సంస్థకు చెందిన వాళ్లు మసీదును ధ్వంసం చేసిన వాళ్లు ఉండటం బాధాకరమని అన్నారు.
ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఒక హిందువులు మాత్రమే కాదు, అన్ని మతాల వారు పోరాడారని గుర్తు చేశారు. ఇలాంటి లౌకికత్వ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన మోడీ.. రాజ్యాంగ విలువలను అయోధ్య సాక్షిగా తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇదే టైములో అయోధ్యలో జరిగిన భూమి పూజకు కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు మద్దతు తెలపడం పట్ల కూడా అసదుద్దీన్ సీరియస్ అయ్యారు. అయోధ్య భూమి విషయంలో ముస్లింలకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానిస్తున్న ప్రధాన పార్టీల కామెంట్లను ఖండించారు.