ఆంధ్రప్రదేశ్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ లో ఉన్న ఎబి వెంకటేశ్వరరావు తనకు అసోసియేషన్ అండగా నిలుస్తుందని భావించారు. తనను ఏబి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందనీ, కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనీ ఇటీవల ఎబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎబి వెంకటేశ్వరరావు లేఖపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించింది. ఎబివిని ప్రభుత్వం పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసినందున విచారణను ఎదుర్కోవాల్సిందేననీ స్పష్టం చేసింది. పలు ఛానల్స్ లో అసోసియేషన్ ఎబివీకి మద్దతుగా నిలిచిందని వస్తున్నవార్తలు అవాస్తమని పేర్కొంది. ఎబివికి ఎలాంటి మద్దతు తెలియజేయలేదని తెలిపింది.
ఎబి వెంకటేశ్వరరావు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటిలెజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలలో ప్రాధమిక సాక్షాధారాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎబి వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను క్యాట్ సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎబివి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఆయనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను పాటించకుండా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో ఎబివి సస్పెన్షన్ లోనే కొనసాగుతున్నారు. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎబివి స్వీయ పర్యవేక్షణలో జరిగిన నిఘా పరికరాల కొనుగోళ్ల అంశంపై విచారణ కొనసాగుతోంది. దీంతో ఎబి వెంకటేశ్వరరావు ఆరెస్టు భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయగా మథ్యంతర ఉత్తర్వులు జారీ కావడంతో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఇదే క్రమంలో ఎబివి వెంకటేశ్వరరావు రాసిన లేఖపై ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించినా ఎబివికి అనుకూలంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.