బెంగళూరు: రాజీనామాకు ససేమిరా అంటున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధమేనని ప్రకటించారు. శుక్రవారం ప్రారంభమయిన శాసనసభ సమావేశాలలో మాట్లాడుతూ, బలపరీక్షకు సమయం నిర్ణయించాల్సిందిగా స్పీకర్ రమేష్ కుమార్ను ఆయన కోరారు.
18 మంది కాంగ్రెస్, జెడిఎస్ శాసనసభ్యుల రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీ ప్రమాదం ఎదుర్కొంటున్నది. ఆ రాజీనామాలను స్పీకర్ ఇంతవరకూ ఆమోదించలేదు. దానిపై శాసనసభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నిర్ణయం చెప్పాల్సిందిగా సుప్రీం ఆదేశాలు ఉన్నప్పటికీ హడావుడిగా నిర్ణయం ప్రకటించేదిలేదని స్పీకర్ స్పష్టం చేశారు.
‘నేను దేనికైనా సిద్ధమే. అధికారాన్ని అంటిపెట్టుకు కూర్చోను’ అని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. శుక్రవారం నాటి విచారణలో రాజీనామాల వ్యవహారంపై ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఇమిడిఉన్న దృష్ట్యా మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది. అప్పటివరకూ రాజీనామాలపై గానీ, అనర్హత వేటుపై గానీ నిర్ణయం తీసుకోరాదని స్పష్టం చేసింది.