కేసీఆర్ అంటే ఏది ఓ పట్టాన పట్టుకోరు..! పట్టుకుంటే వదిలి పెట్టరు..! తన మాటలు, రాజకీయ అడుగులతో రాష్ట్రాన్ని సాధించి, ఏలుకుంటున్న ఈ తెలంగాణ సీఎం దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై పడింది. జాతీయ స్థాయిలో తన ప్రాభవం చాటాలని, చక్రం తిప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మూడో కూటమి ఉండాలని, దానికి తనే నాయకత్వం వహించాలనేది ఆయన వ్యూహం, కల, ఆశయం..!!
బీజేపీ వదిలిన అవకాశం అందుకున్నట్టేనా..??
కోరుకుంటున్న తరుణం తన కాళ్ళ ముందుకు వచ్చినట్టు..!! జాతీయ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న కేసీఆర్ కి బీజేపీ స్వతహాగా కొన్ని అవకాశాలను వదిలింది. రెండు వారలు కిందటే కేసీఆర్ తన సన్నిహితుల వద్ద జాతీయ రాజకీయాలపై చర్చించారు. “నయా భారత్” అనే పేరు కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలను కలవాలి అని ప్రణాళికలు వేసుకున్నారు. సరిగ్గా ఇదే దశలో కేసీఆర్ కి బీజేపీ కొన్ని అవకాశాలను వదిలింది. “వ్యవసాయ బిల్లు”.., “ఉచిత విద్యుత్ వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగింపు” అంశాలను దేశీయంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. కేసీఆర్ వాటిని వ్యతిరేకిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వీటిపై వ్యతిరేకత వస్తుంది. అందుకే ఈ రెండిటినీ కేసీఆర్ తన నెత్తిన వేసుకుని జాతీయ ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు.
వరుసగా భేటీకి ప్రణాళికలు..!!
కేసీఆర్ కి తోడు నడిచేందుకు తమిళనాడు స్టాలిన్ సిద్ధంగానే ఉన్నట్టున్నారు. మరోవైపు మమత బెనర్జీ, కేజ్రీవాల్ లతో కేసీఆర్ ఇప్పటికే ఒకసారి భేటీ వేశారు. గత ఏడాది ఎన్నికలకు ముందు కలిసి నడిచే ప్రయత్నం చేశారు. అది అంతగా సఫలం కాలేదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ, కేంగ్రెస్ యేతర పక్షాలను కలిపే ప్రయత్నాలు చేయనున్నారు. వరుసగా రాష్ట్రాల నేతలతో భేటీలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మమత బెనర్జీ, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి నేతలను కలవనున్నారు. తాను వచ్చే ఏడాది నాటికి జాతీయ స్థాయిలో ఫిక్స్ అవుతూనే.., అదే సమయానికి తెలంగాణ పగ్గాలు కేటీఆర్ కి ఇచ్చేయాలనేది కేసీఆర్ యోచనగా తెలుస్తుంది.
పక్క రాష్ట్రంపై మరో ప్రణాళిక..!!
మరోవైపు ఏపీలో మాత్రం కేసీఆర్ పప్పులు ఉడికేలా కనిపించడం లేదు. చంద్రబాబు ప్రస్తుతం కేసీఆర్ కి బద్ధ శత్రువు. జగన్ స్నేహితుడు అనుకుంటే.. జగన్ బీజేపీకి దగ్గరగా ఉంటున్నాడు. కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన బిల్లులను జగన్ సమర్థిస్తూ బీజేపీకి ఆపన్నహస్తంలా మారిపోయాడు. అందుకే ఇక ఏపీలో చంద్రబాబు, జగన్ లతో కేసీఆర్ కి పని లేదు. కానీ..! కేసీఆర్, చంద్రబాబుల స్నేహం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2004 లో విడిపోయారు. 2009 లో కూటమి కట్టారు. 2014 లో ఎవరి దారిలో వాళ్ళున్నారు. 2019 లో శత్రువులుగా మారారు. అందుకే 2024 లో ఏం జరగనుంది చెప్పలేం. చంద్రబాబు, కేసీఆర్ కలిసి జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని అనుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ చంద్రబాబు ఆలోచనలు మాత్రం ప్రస్తుతం బీజేపీకి దగ్గరగానే ఉన్నాయి. సో.., ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే కేసీఆర్ మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ అధినేతల సాయంతో జాతీయస్థాయికి వెళ్లేందుకు సిద్ధం కావడం మాత్రం ఖాయం. అందుకే ఈ వ్యవసాయ బిల్లు, ఉచిత విద్యుత్ మోటార్లపై పోరు పెద్దది చేస్తున్నారు.