ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. చంద్రబాబుపై వీరిద్దరికీ ఉన్న ఉమ్మడి శత్రుత్వమే వీరి స్నేహానికి నాంది అయ్యేలా.. 2019 ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ పూర్తిగా మద్దతిచ్చేలా చేసింది. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరుకావడం, స్టాలిన్ ను తీసుకురావడం.. జరిగింది. అయితే.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కేంద్రం నిర్ణయాలు వైరం పెంచుతున్నాయి. రాజకీయ అవసరాలు, కేసుల నేపథ్యంలో జగన్ కేంద్రానికి జై కొడుతుంటే.. కేసీఆర్ మాత్రం సై అంటే సై అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయి.
ప్రభుత్వం మాటల కంటే హరీశ్ మాటలకే ప్రాధాన్యం..
రీసెంట్ గా హరీశ్ మాట్లాడుతూ.. కేంద్రం ఇస్తానన్న 4వేల కోట్లకు కక్కుర్తి పడి సీఎం జగన్ రైతుల వ్యవసాయ మోటర్లకు ఉచిత మీటర్లు బిగించేందుకు ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు 2500 కోట్లు ఇస్తామంటే రైతులకు అది మంచిది కాదు అంటూ.. కేసీఆర్ వ్యతిరేకంగా వెళ్తున్నారని అన్నారు. నిజానికి తెలంగాణ నాయకులకు ఏపీలో ఫాలోయింగ్ బాగానే ఉంది. వాళ్ల మాటలకు రాజకీయ అభిమానులు ఏపీలో ఉన్నారు. ఈక్రమంలో హరీశ్ చేసిన వ్యాఖ్యలను ఏపీలో జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు నిశితంగా గమనించాయి. ముఖ్యంగా ఉచిత వ్యవసాయ మీటర్లపై రైతులను ఒప్పించే దిశగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హరీశ్ వ్యాఖ్యలు ఆటంకంగా మారాయి.
వైసీపీ బలంగా ఉన్న చోటే రైతుల్లో వ్యతిరేకత..
రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉన్నది రాయలసీమలో. అక్కడే ఈ అంశంపై వ్యతిరేకత వస్తోంది. భవిష్యత్తులో ఉచితం తీసేస్తారని.. రాయితీలు తగ్గించేస్తారని రైతుల్లో అపోహలు ఉన్నాయి. కేంద్రం గతంలో నగదు బదిలీలో భాగంగా లబ్దిదారులను తగ్గించినట్టే ఇప్పుడు కూడా చేస్తారని ఓ వాదన ఉంది. ఇదే జరిగితే రాయలసీమలో ఉచిత వ్యవసాయ విద్యుత్ పై ఆధారపడి ఉన్న రైతులకు కష్ట కాలమే. అసలే వర్షాలు తక్కువ.. కరువు ఎక్కువ. ఈక్రమంలో రైతులకు ఈ మీటర్ల బిగింపు తలనొప్పిగా మారుతోంది. జగన్ బలంగా ఉన్న రాయలసీమలో ఇది ఇబ్బందికర పరిణామమే.