(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దేశంలో లాక్ డౌన్ పై అనేక రకాలైన అభిప్రాయలు, ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇతర రాష్ట్రాలలో సానుకూలంగా ఉన్నప్పటికీ ఏపిలో మాత్రం మిశ్రమ స్పందన వస్తున్నది. ఏపిలో ప్రజలంతా ఈ లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందా అని ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు పోతాయేమో అన్న భయంతో కొందరు, వ్యాపారాల్లో నష్టం వస్తుందని అని భయపడే వారు మరి కొందరుండగా రెక్కాడితే కానీ డొక్కాడని వారు పనులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ ముగిసిపోతే బాగుండు అని కోరుకుంటుండగా ప్రధాని మోడీ మెజారిటీ ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని గౌరవించిన విధంగా లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. మొన్న ముఖ్య మంత్రుల వీడియో కాన్ఫెరెన్స్ లో ఏపి సిఎం జగన్ చెప్పిన అభిప్రాయం చూస్తే గ్రీన్ జోన్ లకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉంటుందని భావించారు.
మిగతా దేశాలతో పోల్చితే భారత్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు కనబడ్డాయి. కరోనా వైరస్ రోగుల సంఖ్య వందకు చేరుకోక ముందే విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల ఐసోలేషన్ను భారత్ తప్పనిసరి చేసింది. 550 కేసులున్న సమయంలోనే 21 రోజుల లాక్డౌన్ ప్రకటనను నరేంద్ర మోడీ చేశారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాలా మెరుగైన స్థితిలో ఉంది.
నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్తో సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాల్లో భారత్ కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయి. మంగళవారం నాటికి భారత దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 10,363కి చేరుకోగా 339 మంది మృత్వువాత పడ్డారు.
భారత్ త్వరగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకోకపోతే కేసులు, మరణాల సంఖ్య భారీ గా పెరిగేదని అంటున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తే, మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని అని అర్థం అవుతుందని మోడీ పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించడం, లౌక్డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగిందని అయన చెప్పారు. ఆర్థిక పరంగా చూసుకుంటే దీని వల్ల భారీగా నష్టం జరిగింది కానీ, దేశ పౌరుల ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదని మోడీ అన్నారు.
కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రపంచవ్యాప్తంగా నిపుణులను, ప్రభుత్వాలను భయపెడుతోంది. కరోనా వైరస్పై పోరాటం ఎలా కొనసాగించాలి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రజల ఇబ్బందులను ఎలా తక్కువ చేసుకోవాలి అన్న విషయాలపై రాష్ట్రాల ముఖ్య మంత్రులతో మోడీ చర్చించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాలు కోరగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 20 వ తేదీ వరకూ అన్ని చోట్లా కఠినంగా లాక్డౌన్ అమలు చేసి హాట్స్పాట్లు పెరగకుండా ఉన్న ప్రాంతాల్లో కొన్ని సడలింపులు చేయాలని కేంద్రం నిర్ణయించింది.