ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుతో నవ్యాంధ్రప్రదేశ్కు రాజధానిగా టీడీపీ ప్రకటించిన అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు. ప్రధాని నరేంద్రమోదీ అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేసి సరిగ్గా ఐదేళ్లు పూర్తవుతోంది.
ఈ ఐదేళ్లలో అమరావతి ఎన్నో ఆశలు కల్పించింది. అద్భుతాలకు వేదికగా నిలుస్తుందనే అభిప్రాయాలు కల్పించింది. దీంతో పాటుగా అనేక ఆరోపణలకు వేదికగా నిలిచింది. అనేక అనుమానాలు సైతం కలిగించింది. రాజకీయ ఎత్తుగడలకు వేదికగా నిలిచింది.
వైసీపీ సర్కారు నిర్ణయం ఏంటంటే…
అమరావతి ఎంపిక వెనుక టీడీపీ పెద్దల స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ బలంగా నమ్ముతున్న భావన. ఈ మేరకు వివిధ అంశాలను వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ఉటంకిస్తూనే ఉన్నారు. అందుకే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల అజెండాను వైసీపీ ఎత్తుకుంది. పరిపాలన, న్యాయ, కార్య నిర్వాహక రాజధానులతో ముందుకు సాగుతూ విశాఖపట్టణం, అమరావతి, కర్నూలును అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ ప్రక్రియకు పలు కోర్టు కేసులు అడ్డు వచ్చాయి.
ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతోందంటే…
అమరావతి కి శంకుస్థాపన నేటికి 5 ఏళ్ళు అవుతున్న తరుణంలో… శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మొలిచిన పిచ్చి మొక్కలు రైతులు శుభ్రం చేసుకున్నారు. శంకుస్థాపన ప్రాంతం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఆ ప్రదేశంలో శుభ్రం చేయడానికి వీలు లేదని కాసేపు పోలీసులు ఆంక్షలు విధించారు. తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి శుభ్రం చేసుకునేందుకు రైతులకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
మోదీ, ఇంటెలిజెన్స్ స్పందించాల్సిందే
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తాజాగా ఐదేళ్ల సందర్భం గురించి మాట్లాడుతూ, రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుకోవడానికి కారణం, కేవలం ఒక వర్గం బాగు పడుతుందన్న అసూయన అని ఆరోపించారు. అదే విధమైన చాడీలను ఆయన కేంద్రపెద్దల ముందు చెప్పారని మండిపడ్డారు. ప్రధాని రాజధానికి శంఖుస్థాపన చేసి ఐదేళ్లు అవుతున్నందున, ఈ విషయాలన్నీ కేంద్ రప్రభుత్వానికి తెలియాలనేది టీడీపీ ఉద్దేశమని ఆయన వెల్లడించారు. తాము చెప్పిన వివరాలను, దళితులను, బీసీలను, మైనారిటీలను జగన్మోహన్ రెడ్డి తొక్కేసిన విధానాన్ని బీజేపీ నేతలు, కేంద్ర ఇంటిజెన్స్ వర్గాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, అమరావతికి న్యాయం చేయాలని కోరారు.