మంగళగిరి: మంగళగిరి టిడిపి అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్ ఎట్టకేలకు అమోదం లభించింది. లోకేష్ నామినేషన్ లో నోటరీ విషయంపై వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా నోటరీ గుంటూరు జిల్లాలో చెల్లదంటూ రిటర్నింగ్ అధికారి వద్ద ఆయన అభ్యంతరం తెలిపారు.
నామినేషన్ దాఖలు చేసిన లోకేష్ ఇంటి అడ్రస్ను తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నారు. దీనిని కృష్ణా జిల్లాకు చెందిన లాయర్తో నోటరీ చేయించారు.
తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని వైసిపి అభ్యర్థి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. నోటరీ రూల్స్ 1956 -8,8ఏ, 9 ప్రకారం నామినేషన్ ఫారమ్ 26 చెల్లదని ఆళ్ల పేర్కొన్నారు.
వివరణ ఇచ్చేందుకు లోకేష్ తరపు న్యాయవాది కొంత సమయం కావాలని రిటర్నింగ్ అధికారిని కోరారు. సరైన పత్రాలు సమర్పించేందుకు లోకేశ్కు రిటర్నింగ్ అధికారి 24 గంటలు గడువు ఇచ్చారు. కొద్ది సేపటిలోనే లోకేష్ తరపు న్యాయవాదులు ఎన్నికల అధికారికి క్లారిఫికేషన్ ఇవ్వడంతో రిటర్నింగ్ అధికారి లోకేష్ నామినేషన్ ను అమోదించినట్లు ప్రకటించారు.
ఎన్నిక షెడ్యూల్లో భాగంగా మంగళవారం అధికారులు నామినేషన్లను పరిశీలించారు.