Polavaram Project: ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన ఆమోదంకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే చావు కబురు చల్లగా చెప్పినట్లు కేంద్ర మంత్రి షెకావత్ సవరించిన డీపిఆర్ అనుమతుల కోసం తమ వద్ద పెండింగ్ లో ఏవీ లేవని చెప్పారు. దీంతో ఖంగుతినడం ఏపి వంతు అయ్యింది. రాజ్యసభలో వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సీఎం వైఎస్ జగన్, ఇతర మంత్రులు, ఎంపీలు అనేక మార్లు పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తమ విజ్ఞప్తులపై సానుకూలంగా కేంద్ర మంత్రి షెకావత్ స్పందించారంటూ వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించారు.
ఇప్పుడు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు 2011 – 19 లోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సవరించిన డీపిఆర్ ను సమర్పించలేదని కేంద్రం పేర్కొనడం గమనార్హం. సవరించిన అంచనాల ప్రకారం 54 వేల కోట్ల రూపాయలు ఆమోదించాలని ఇటీవల వైసీపీ ఎంపిలు కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సవరించిన అంచనాలను ఆమోదించామనీ, ఆర్థిక శాఖకు పంపుతామని కేంద్ర మంతరి తెలిపారని ఎంపీలు మీడియా సమావేశంలో వెల్లడించారు. నాలుగు రోజులు తిరగకముందే కేంద్రం సమాధానం అందుకు భిన్నంగా ఉండటం ఏపి ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చినట్లు అయ్యింది.