కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ విషయంలో గతంలో పలు ప్రభుత్వాలు సీబీఐ విచారణకి అనుమతులు ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కారణం చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు సిబిఐ ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలపై అదేవిధంగా ప్రత్యర్థులపై కట్టడి చేసే రీతిలో వ్యవహరించటం జరిగింది. దీంతో గతంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ మరికొన్ని రాష్ట్రాలు సిబిఐ తమ రాష్ట్రాల లోకి రాకూడదంటూ, విచారణ జరపకూడదు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సి.బి.ఐ దర్యాప్తు పరిధికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేనిదే సి.బి.ఐ తన పరిధిని విస్తరించా కూడదు అంటూ స్పష్టం చేసింది. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఖచ్చితం అని పేర్కొంది. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా చట్టాలు ఉన్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇటీవల యూపీలో జరిగిన అవినీతి కేసులో నిందితులైన అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని న్యాయమూర్తులు ఎ.ఎం. ఖాన్వి ల్కర్, గవాయ్ లతో కూడిన బెంచ్ ఈ సందర్భంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టాన్ని ప్రస్తావించింది.
గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చాలావరకూ సిబిఐని దుర్వినియోగం చేసే రీతిలో ప్రత్యర్థులపై వారి ఆస్తులపై విచారణ అంటూ చాలామంది పై కేసులు వేయించడంతో పాటుగా జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో సుప్రీం న్యాయస్థానం సి.బి.ఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని తీర్పు ఇవ్వటంతో ఈ విషయం దేశ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.