photo courtesy: ANI
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్ ఈ మూడు పదవులూ రాజకీయాలకు అతీతమైనవి. ఈ పదవులు స్వీకరించక ముందు ఏ రాజకీయపార్టీలో ఉన్నా ఒకసారి పదవి స్వీకరించిన తర్వాత ఇక రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అధికారంలో ఉన్న రాజకీయ పక్షం మద్దతుతోనే ఈ మూడు పదవుల్లో దేనికైనా ఎన్నిక కాగలరు. కానీ ఎన్నిక అయిన తర్వాత వారికి పార్టీతో సంబంధం ఉండకూడదు. అయితే వాస్తవానికి అలా జరుగుతోందా?
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాటకారి. మాటకారి మాత్రమే కాదు, అంత్యప్రాసలతో ప్రసంగాన్ని బ్రహ్మాండంగా రక్తి కట్టించగల వక్త. ఆయనను ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసినపుడు తెలుగు రాష్ట్రాలలో, ‘వెంకయ్య నాయుడి గారి నోటికి తాళం వేశారే, అయ్యో’ అన్న కామెంట్లు వినబడ్డాయి.
నిజానికి వెంకయ్య నాయుడి అభిమానులు అంత విచారపడాల్సిన పని లేదు. ఉప రాష్ట్రపతి హోదాలో ఆయనకు అధికారిక కార్యక్రమాలు తక్కువేం ఉండవు. వెళ్లిన చోటల్లా మాటలపై తనకున్న పట్టును ప్రదర్శించవచ్చు. ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు రాజ్యసభ ఛైర్మన్గా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. మోదీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్న రాజ్యసభలో ఒకటే రభస కాబట్టి అక్కడ కూడా వెంకయ్య నాయుడికి గట్టి పనే.
సొంత రాష్ట్రం కాబట్టి వెంకయ్య నాయుడు తరచూ ఆంధ్రప్రదేశ్ వస్తుంటారు. నిన్నటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో భాగం కాబట్టి తెలంగాణ కూడా తరచూ వెళుతుంటారు. వెళ్లిన చోటల్లా తన కార్యక్రమాలకు హాజరయిన వారికి ఆయన నాలుగు మంచి మాటలు చెబుతుంటారు. అంతవరకూ బాగానే ఉంది.
గురువారం ఉప రాష్ట్రపతి హైదరాబాద్లో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ విదేశాంగ నీతిపై ఆ పుస్తకాన్ని ప్రొఫెసర్ శేషగిరి రావు అనే బిజెపి నాయకుడు రాశారు. ఆ సందర్భంగా ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ, మోదీ విదేశాంగ నీతిని కొనియాడారు. ఆయన విదేశీ పర్యటనలపై వస్తున్న విమర్శలను ఖండించారు. నిజానికి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ వ్యాఖ్యలే. ఆ పదవిలో ఉండి వెంకయ్య నాయుడు చేయకూడని వ్యాఖ్యలే.
ఆయన అక్కడితో ఆగలేదు. దేశ రక్షణ విషయంలో నరేంద్ర మోదీ రాజీ పడరనీ, ఆ విషయంలో ఆయన భేషైన రీతిలో వ్యవహరిస్తున్నారనీ వ్యాఖ్యానించారు. ఇవి తప్పనిసరిగా ఉప రాష్ట్రపతి చేయకూడని వ్యాఖ్యలు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో స్వయంగా ప్రధాని అవినీతికి పాల్పడ్డారని ఒకపక్క ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. రఫేల్ స్కామ్పై పార్లమెంటులో చర్చ జరిగింది. దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించాలని మెజారిటీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి పదవిలో ఉండి వెంకయ్య నాయుడు ప్రధానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఆ పదవి ఔన్నత్యం వెంకయ్య నాయుడుకు బాగా తెలుసు. మరి ఒకసారి ఇలాంటి సంప్రదాయం నెలకొల్పితే భవిష్యత్తులో ఇది ఇంకా ఎంత కిందికి దిగజారుతుందో తెలియదా?