వరంగల్ జిల్లాలో కాకతీయుల రాజుల కళావైభవం తో నిర్మించిన అద్భుత కట్టడాల టెక్నాలజీ అయోధ్య రామాలయానికి ఉపయోగిస్తే వెయ్యేళ్ళు వర్ధిల్లుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాకతీయ రాజులు వరంగల్ లో నిర్మించిన వేయి స్తంభాల ఆలయం, రామప్ప టెంపుల్ నిర్మించి చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పైగా ఈ నిర్మాణంలో సిమెంట్, కంకర, సున్నం అలాంటివి ఏమీ ఉపయోగించకుండా కేవలం ఇసుక నే పునాదిగా చేసి “సాండ్ బాక్స్ టెక్నాలజీ” విధానం ద్వారా నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అయోధ్యలో నిర్మించబోయే రామాలయం కూడా ఇదే రీతిలో నిర్మాణం జరిగితే వెయ్యేళ్ళు వర్ధిల్లుతుందని… రామాలయం నిర్మాణానికి పూనుకున్న శ్రీ రామ జన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులకు నిపుణులు ప్రతిపాదన పంపారు.
సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే…దేవాలయ నిర్మాణం ఏ ఆకారంలో నిర్మిస్తారో, అదేరీతిలో అంతటి పరిమాణంలో గుంతలు తవ్వి… నది నుంచి తీసుకొచ్చిన నాణ్యమైన ఇసుకను దట్టంగా నింపుతారు. ఆలయానికి ఈ ఇసుక గుంత పునాదిలా ఉంటుంది. అలా పలు పొరల్లో కొన్ని మీటర్లు ఎత్తుగా ఇసుకను నింపుతారు. ఆ రీతిలో మండపం, స్తంభాలు నిలబెట్టి ఆలయాలు అప్పట్లో నిర్మించేవారు. ఈ రకంగా కట్టడం కట్టిన ఆలయాలు భారీ భూకంపాలను సైతం తట్టుకునే శక్తి ఉంటుందని నిపుణులు చెప్పుకొస్తున్నారు.
ఇదే తరహాలో అయోధ్యలో నిర్మించబోయే రామాలయానికి సాండ్ బాక్స్ టెక్నాలజీ వాడితే…. వెయ్యేళ్లు గడిచినా చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు అయోధ్య రామాలయం నిర్మాణానికి పూనుకున్న రామాలయం ట్రస్ట్ కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సో అంతా ఓకే అయితే అయోధ్యలో వరంగల్ సాండ్ బాక్స్ టెక్నాలజీ తో నిర్మాణం జరిగితే, అయోధ్య రామాలయం కాకతీయ రాజులు కట్టించిన ఆలయాల లుక్ రావటం గ్యారెంటీ అని నిపుణులు చెపుతున్నారు.