అమరావతి: చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. కృష్ణానది వరద ఉధృతిని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి గురువారం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి దీవుల ఏర్పాటు, గెస్ట్ హౌస్ నిర్మాణం లాంటి చర్యలతో బ్యారేజిలో నీటి నిల్వను కుదించేశారనీ, దీనితో ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే ఆయన హైదరాబాద్లో దాక్కున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
చంద్రబాబు కష్టాలు పగవాడికి కూడా రావొద్దంటూ వ్యంగ్యాస్తాన్ని సంధించారు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించారనీ, నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పుడైనా అర్థమైందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘మీరు ఓడిపోవడమేంటయ్యా’ అని అప్పుడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది’ అని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.
నదులు, వాగులను తవ్వి ఏ ఇసుక నుంచి ధనరాసులు పోగు చేసుకున్నాడో ఇప్పుడు అవే ఇసుక బస్తాలతో కరకట్ట కొంపను వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో ఈ ఒక్క ఉదంతం చాలనీ, ప్రకృతితో పెట్టుకుంటే బాబు మటాషేనని విజయసాయిరెడ్డి అన్నారు.
ఐదేళ్లుగా బాబు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని ఎల్లో మీడియా రాస్తుందేమోనంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా, బాబు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు అంటూ విజయసాయిరెడ్డి వ్యంగంగా విమర్శించారు.