YS Viveka Case; వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడుగా వెళ్తుంది. మూలాల్లోకి వెళ్లి చిన్నస్థాయి వాళ్ళని పదే పదే విచారణకి పిలుస్తుంది.. ఎన్నడూ లేని విధంగా ఈ దశలో 31 రోజుల నుండి విచారణ కొనసాగిస్తూనే ఉంది.. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఈ సారి చార్జిషీట్ వేసేలానే ఉంది..! ప్రస్తుతానికి సీబీఐ ఎక్కువగా ప్రశ్నిస్తున్న పేర్లు – కృష్ణారెడ్డి (వివేకానందరెడ్డి పీఏ).., యెర్ర గంగిరెడ్డి (వివేకా ప్రధాన అనుచరుడు) హిదయతుల్లా (వివేకా ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్).., కిరణ్ కుమార్ యాదవ్ (స్థానిక వైసిపి కార్యకర్త).., ప్రసాద్ (వివేకా డ్రైవర్)..! ఈ అయిదుగురిని సీబీఐ పదే పదే విచారణకు పిలిపిస్తూ రోజల తరబడి, గంటల కొద్దీ ప్రశ్నలు అడుగుతుంది.
సాధారణంగా ఏదైనా హత్యకేసులో మూడు వర్గాలుగా అనుమానాలుంటాయి. పాత్రధారులు.. సూత్రధారులు.. సహకరించిన వారు..! ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో మూడో వర్గానికి చెందిన వారు అందుబాటులో ఉన్నారు. పైన చెప్పుకున్న వ్యక్తులు ఈ హత్య కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల కిందట సిట్ దర్యాప్తులో కూడా కృష్ణారెడ్డి, యెర్ర గంగిరెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ ఇద్దరితో పాటూ శ్రీనివాసరెడ్డి (ఈయన ఇదే కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకున్నాడు). పోలీసులు అరెస్టు చేసారు. బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు సీబీఐ కూడా తిరిగి, తిరిగి ఈ ఇద్దరి దగ్గరే ఆగింది. అంటే ఈ ఇద్దరి పాత్ర స్పష్టంగానే తేలినట్టు చెప్పుకోవచ్చు. సాక్ష్యాలు ఎందుకు తారుమారు చేసారు..? ఎవరు చెప్తే చేశారు..!? అనే దిశగానే సీబీఐ విచారణ, ప్రస్నావలి సాగుతున్నట్టు తెలుస్తుంది.
YS Viveka Case; ఈ నెలలో ఇదే తీరున ప్రశ్నలు..!!
గడిచిన నెల రోజులుగా విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు.., 30వ రోజు అంటే నిన్న ఐదుగురు అనుమానితులను సీబీఐ అధికారులు పప్రశ్నించారు. ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ హిదాయతుల్లా, డ్రైవర్ ప్రసాద్, వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ను సీబీఐ అధికారులు వరుసగా రోజుల తరబడి విచారిస్తున్నారు. మొన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ ఐదుగురిని పులివెందుల అతిథి గృహంలో విచారించిన అధికారులునిన్న కూడా మరోసారి విచారణకు పిలిచారు. నిన్న రాత్రి వరకు ప్రశ్నించి .., మళ్ళీ ఈరోజు ఉదయాన్నే పిలిపించారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో రెండేళ్ల కిందట ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిలుపైన ఉన్న వీరిని మరోసారి సీబీఐ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వివేకా హత్యకు ముందు రోజు కొన్ని వాహనాల ద్వారా రెక్కీ నిర్వహించినట్టు సీబీఐ గుర్తించింది. ఆ వాహనాలు ఎవరివి..!? వారు ఎవరు..!? అనేది తేలాల్సి ఉంది.