రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారానికి ఆయనపై అనర్హత వేటు ద్వారా పురిస్టాప్ పెట్టాలని వైకాపా భావిస్తోంది. పార్టీలోని ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలకు కూడా ఈయన అనర్హత వేటు ద్వారానే మళ్ళీ ఆ ఆలోచన చేయకుండా మిగిలిన వారు ఉంటారని పార్టీ యోచనలో ఉంది. అందుకే రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్ గా పరిగణించింది. వ్యతిరేక వ్యాఖ్యలను ఏ మాత్రం సహించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు రఘురామ కృష్ణంరాజు ను ఎంపీగా అనర్హుడుగా నిర్ధారించాలని కోరుతూ పార్లమెంట్ స్పీకర్ ఓం బిల్లాను కలిసేందుకు వైసీపీ బృందం ఈ రోజు ఢిల్లీకి పయనమైంది.
న్యాయనిపుణులు కూడా..
ఢిల్లీకి ఆరుగురు ఎంపీల బృందంతో పాటు ఇద్దరు న్యాయనిపుణులు కూడా వెళ్లి లోకసభ స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల తరువాత వీళ్లకు అపాయింట్మెంట్ ఖరారైనట్టు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే వైకాపా ఎంపీలు ఇద్దరు స్పీకర్ ను కలిసి ఈ విషయం పై ప్రాధమిక సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆ ఇద్దరితో పాటు మరో నలుగురు ఎంపీలు ఇద్దరు న్యాయనిపుణులు కూడా స్పీకర్ ను కలిసే బృందంలో ఉన్నారు. రఘురామ కృష్ణంరాజు కి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి స్పందనగా రఘురామకృష్ణంరాజు కూడా వ్యంగ్యంగా స్పందిస్తూ పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదనీ ఆయన తరహాలో చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ జగన్ కి కోపం తెప్పించాయట. అందుకే అయనను పార్టీ నుంచి గెంటి వేయడంతో పాటు తక్షణమే పార్లమెంటు సభ్యుడిగా కూడా మాజీని చేయాలని జగన్ గట్టి వ్యూహం పన్నారు. దానిలో భాగంగానే చట్టాలను అవపోసన పట్టిన కొంత మంది లాయర్లను కూడా వెంటబెట్టుకొని ఢిల్లీకి ఈ బృందం పయనమైంది.