YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆదివారం సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయని అన్నారు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవటమేనని, ఇదీ చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు.
బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని జగన్ అన్నారు. వదల బొమ్మాళీ వదల అంటూ మన ప్రతి పేదవాడి ఇంటికీ వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపుపతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో, నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద అని అన్నారు. నా మేనిఫెస్టోను నూటికి 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఖురాన్, భగవద్గీతగా భావించి మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దెవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడని అన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్.. ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ వెళ్లిపోతారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో వస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది అబద్ధాల ఫ్యాక్టరీ అని విమర్శించారు. చంద్రబాబుకు గాని, పవన్ కల్యాణ్కు గాని రాష్ట్రానికి మంచి చేసిన చరిత్రేలేదన్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు తెలుసని, మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు.
మరో రెండు వారాల్లో మహాకురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని, ప్రజలు వైసీపీకి అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. 58 నెలల పాలనలో ప్రతి కుటుంబానికి మంచి చేశామని చెప్పారు. లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా డబ్బులు వేశామని అన్నారు. చంద్రబాబులా తాను సెల్ఫోన్ కనిపెట్టానని చెప్పడంలేదని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని తెలిపారు. తన హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని, తద్వారా రూపు రేఖలన్నీ మారిపోయాయని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.
గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడన్నారు. ఎప్పుడూ ఎవ్వరూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ చేయడం జరిగిందని, ఎక్కడా లంచాలు, వివక్షతకు తావు లేకుండా పంపిణీ చేశామన్నారు. ఇలా లంచాలు లేని, వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికీ జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి, చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు, దీవెనలు అడుగుతున్నాడని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రజలకు పరిచయం చేసి ఆశీర్వదించాలని జగన్ కోరారు.
Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం