వైసిపిలో అంతర్గత రాజకీయాలు ఊపందు కుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ కు పార్టీ అధినేతగా పెద్ద పని పడింది. పార్టీ స్థాపించిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత వరుసగా నామినేటెడ్ పదవులు పార్టీ నాయకులకు కేటాయించే పని జగన్ చేతిలోనే ఉంది. ఇది పార్టీ పరంగా సున్నితమైన అంశం. ఎవరికి ఇచ్చినా అది ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. దీన్ని చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అయితే నెలలు తరబడి నాన్చుతూ లీకులు, లాబీయింగ్ లతో నెట్టుకొస్తారు. కానీ జగన్ మాత్రం అనూహ్య నిర్ణయాలతో ఎవరికీ అంతుపట్టని విధంగా కేటాయింపులు చేస్తున్నారు.
ఎమ్మెల్సీలు: చివరి నిముషాల్లో మార్పులు ఏమిటో?
వైసీపీలో ఎమ్మెల్సీల కేటాయింపు ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వీటిలో నిర్ణయాలలో మార్పులు కూడా అంతే జోరుగా ఉన్నాయి. మొదట చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని అనుకున్నారు. ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన మైనార్టీ నాయకుడు వీరందరికీ ఖచ్చితం అనుకున్నారు. ప్రచారం జరిగింది. పుకార్లు ఊపందుకున్నాయి. వైసీపీలో ఆంతరంగిక సంభాషణలలో కూడా చాలా వరకు ఇవే ఖరారు అయ్యాయి. కానీ ఈ పేర్లులో అనుగుణంగా మార్పులు కనిపించాయి. మర్రి రాజశేఖర్ కు మొండి చేయి ఎదురు అయ్యింది. కొయ్యే మోషేన్ రాజుకు ఇంకొన్నాళ్ళు వేచి చూపు తప్పలేదు. తాజాగా ఈ రోజు ఖరారు అయి గవర్నర్ ప్రకటించిన పేర్లు పరిశీలిస్తే..కొయ్యే మోషేన్ రాజు స్థానంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు వచ్చి చేరారు. ఈ ఊహించని పేర్లు, ఆకస్మిక మార్పులు సీఎం జగన్ కు, వైసీపీ ముఖ్య నేతలకు తప్ప ఇతరులకు ఎవరికీ అంతుపట్టడం లేదు. దీన్ని వివాదం చేయాలని కూడా ఎవరూ చూడటం లేదు. చర్చ కు కూడా కనీసం ఎవరు దిగడం లేదు. కారణం వైసీపీలో జగన్ నిర్ణయానికి తిరుగు లేదు. ఆయన ఏం చెప్తే అది నూటికి నూరు పాళ్లు అవ్వాల్సిందే. అమలవుతుంది. పైగా ఇది వివాదరహిత నిర్ణయం కూడా.
రవీంద్ర బాబుకు ఇవ్వడం వెనుక కారణాలు పరిశీలిస్తే…
కొయ్యే మోషేన్ రాజు వైసిపికి పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిదేళ్ల నుండి సేవలందిస్తున్నారు. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కొన్నాళ్ళు పని చేశారు. కొన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జిల నియంకంలోనూ, మండల కన్వీనర్ ల నియంకంలోనూ కీలకంగా వ్యవహరించారు. అయితే 2014లో కొవ్వూరు టికెట్ తనకు దక్కలేదనే కారణంతో అలిగి పార్టీని వీడి టీడీపీలో చేరి పోయారు. కానీ అక్కడ కూడా సర్దుబాటు కాలేక నెలల వ్యవధిలోనే మళ్లీ వైసీపీ గూటికి చేరారు. ఇలా మోషేన్ రాజు ఒక చిన్న మచ్చ వేసుకున్నప్పటికీ జగన్ కి నమ్మిన బంటుగానే ఉంటూ వచ్చారు. ఆయన వివాదరహితుడు. రాజకీయంగా పెద్దగా అందరికీ తెలిసిన వ్యక్తి కాదు. ఆయన స్థానంలో అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు కి ఎమ్మెల్సీని ఖరారు చేశారు. రవీంద్ర బాబు సొంత జిల్లా అంటే ఆయన పుట్టింది, పెరిగింది పశ్చిమగోదావరి జిల్లా లోని దెందులూరు పక్కన ఉన్న కొవ్వలి గ్రామం. ఆయన ఎంపి గా పనిచేసింది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం. అంతకు ముందు ఆయన కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. కస్టమ్స్ అధికారిగా ఢిల్లీలోనూ, ముంబయి లోనూ అనేక విభాగాల్లో పని చేశారు. విద్యా వంతుడు కావడం, రెండు జిల్లాల్లో పట్టు ఉండటం, కేంద్ర స్థాయిలో పని చేసినందున అనేక చట్టాలు, అనేక అంశాలపై పట్టు ఉండటం ఆయనకు ప్లస్ అయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు టిడిపిని వీడి జగన్ ను నమ్మి లో వైసీపీలో చేరగా అమలాపురం ఎంపీ సీటు కేటాయించకపోవడంతో ఆయనకు నాడు సర్ది చెప్పిన సీఎం జగన్ నేడు ఎమ్మెల్సీ ఇచ్చి శాంతింపజేశారు. దీనిలో రెండు వైపులా పార్టీకి, జగన్ కు మంచి చేసేవే కనిపిస్తున్నాయి. విద్యావంతుడు, ఒక మాజీ కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అధికారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, సామాజిక వర్గ పరంగా కూడా కొయ్యే మోషేన్ రాజు ఏ సామాజిక వర్గానికి చెందిన వారో రవీంద్ర బాబు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, రెండు జిల్లాలలో ప్రభావితం చేయగలగడం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కావడంతో రవీంద్రబాబుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.