చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ ఆ దేశానికి చెందిన 59 యాప్లను నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిల్లో టిక్టాక్ కూడా ఒకటి. అయితే ఆయా యాప్లు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని, భారత పౌరుల డేటాను తస్కరించి చైనా సర్వర్లలో స్టోర్ చేస్తున్నాయనే ఆరోపణలతోనే వాటిని నిషేధించామని కేంద్రం తెలిపింది. అయితే ఆయా యాప్లను నిషేధించినప్పటికీ ఇంకా వాటిని మన దేశంలో కొందరు వాడుతున్నట్లు తెలిసింది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజానికి నిషేధిత యాప్స్ మాత్రమే కాదు, వెబ్ సైట్లను కూడా మన దేశంలో యాక్సెస్ చేయవచ్చు.
Virtual Private Network (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్).. దీన్నే షార్ట్కట్లో VPN అని కూడా అంటారు. గూగుల్ ప్లే స్టోర్లో పలు వీపీఎన్ యాప్స్ లభిస్తున్నాయి. వీటిని ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే వీటి ద్వారా ఫోన్ నెట్వర్క్ లొకేషన్ మార్చవచ్చు. అంటే వీపీఎన్ యాప్ను ఓపెన్ చేసి అందులో చూపించే ఇతర దేశాల్లో ఏదైనా ఒక దేశం నెట్వర్క్ను ఎంచుకుంటే.. మనం వాడే మొబైల్ డేటా నెట్వర్క్ ఆ దేశంలో ఉన్నట్లు మారుతుంది. అంటే.. ఉదాహరణకు యాప్లో అమెరికా అనే ఆప్షన్ ను ఎంచుకుంటే అప్పుడు మన ఫోన్ నెట్వర్క్ కనెక్షన్ అమెరికాకు మారుతుందన్నమాట. అంటే సాంకేతికంగా మనం అమెరికాలో ఉన్నట్లు లెక్క. దీంతో నిషేధిత యాప్స్, సైట్లు ఓపెన్ అవుతాయి.
ఇలా వీపీఎన్ యాప్స్ ద్వారా ప్రస్తుతం నిషేధిత చైనా యాప్ లను వాడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా చాలా మంది టిక్టాక్ను ఈ విధంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇతర నిషేధిత యాప్స్, సైట్లను కూడా వీపీఎన్ ల ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. దీంతో కేంద్రం ఆ యాప్లను నిషేధించి కూడా ఫలితం లేకుండా పోతుందని నిపుణులు అంటున్నారు. అయితే వీపీఎన్లను కూడా బ్యాన్ చేయగలిగితే అప్పుడు ఆ నిషేధిత యాప్స్, సైట్లు ఏవీ ఓపెన్ కావు. మరి కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందో, లేదో చూడాలి.