వైెఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే ఆయన కుమార్తె షర్మిల తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టారని ఆమె అన్నారు. వైఎస్ కుటుంబం ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదని, పని చేయలేదని అరుణ చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉందనీ, ఆంధ్ర వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా తెలంగాణ ప్రజలు ఆదరించరని అన్నారు అరుణ.
2019 ఎన్నికల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు అరుణ. ఆమె ఏపిలో పోటీ చేయాలి కానీ తెలంగాణలో పార్టీ పెట్టడమెందుకు అని అరుణ నిలదీశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఎందుకు పెట్టారో ఆమెకే తెలిదయదన్నారు. కేవలం ఒక పార్టీకి లబ్ది చేకూర్చేందుకే షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని డీకే అరుణ ఆరోపించారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని డీకే అరుణ జోస్యం చెప్పారు. షర్మిల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదనీ, ఏపికి వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర విభజన సందర్భంలో పోలవరం ముంపు మండలాాలను ఏపిలో కలిపారని, ఇప్పుడు రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రి కేసిఆర్ వాటి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. తమను తెలంగాణలో కలపాలని ఆయా మండలాల ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని, ఏపిలో వారికి కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడమే దానికి కారణమని అన్నారు. ఇక బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎవరెవరు ఎప్పుడు చేరాలనే విషయాన్ని తమ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని అరుణ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసిఆర్, జగన్ కు ఒక అండర్ స్టాండింగ్ ఉందని, కేవలం ఓట్లు అవసరమైన సందర్భంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్జజల్లో వ్యతిరేేకత ఉందనీ, ఈ సారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ.