బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా కట్టప్ప క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయ నాయకులు వెన్నుపోటు దారులను కట్టప్పలుగా సంభోదిస్తూ ఉంటారు. అలానే బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ .. టీఆర్ఎస్ లో చాలా మంది కట్టప్పలు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుండి వారు సమయాన్ని బట్టి బయటకు వస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని విమర్శించిన లక్ష్మణ్ .. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఆ పార్టీలోని కట్టప్పలు అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి వెనుక బీజేపీ హస్తం లేదని చెప్పారు లక్ష్మణ్.
టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి కారణంగానే వారు బయటకు వస్తారని అన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరడం ట్రైలర్ మాత్రమేననీ, అసలు సినిమా ముందుందని అన్నారు లక్ష్మణ్. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా ముందు సీఎం కేసిఆర్ సరితూగలేరనీ అందుకే మరో సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కేసిఆర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) కుట్రలు తెలంగాణలో పని చేయవని అన్నారు. జాతీయ పార్టీ పెడతానంటూ కేసిఆర్ ప్రగల్బాలు పలుకుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వ కూల్చివేతలో తమ ప్రమేయం ఏమి లేదని మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ.. ఏక్ నాథ్ శిందే మంత్రి వర్గంలో భాగస్వామ్యమైన సంగతి తెలిసిందే. అయితే అక్కడ బీజేపీ 106 స్థానాలు ఉండటంతో శివసేన చీలిక వర్గానికి బీజేపీ మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటు చేయగలిగింది. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దానికి తోడు మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో కేసిఆర్ సర్కార్ ను కూల్చేందుకు ఆ పార్టీ నేతలు పూనుకుంటారు అనేది నమ్మశక్యంగా లేదనే మాటలు వినబడుతున్నాయి.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్ : వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కారణం ఏమిటంటే..?