Telangana BJP: తెలంగాణలో గత కొంత కాలంగా బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్, ఈ రెండు పార్టీలు ఒకటే నంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజల్లోనూ ఈ ప్రచారం బలంగా వెళుతోంది. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ కుమార్ సిసోడియాతో పాటు అనేక మంది కీలక నేతలను అరెస్టు చేసిన ఈడీ, సీబీఐ.. తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో సైలెంట్ కావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది.
దీంతో బీఆర్ఎస్ కు దూరమైన నేతలు తొలుత బీజేపీలో చేరాలని భావించినా ఈ పరిణామాల క్రమంలో వారు కాంగ్రెస్ వైపుకు మొగ్గుచూపారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆదివారం హైదరాబాద్ కు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో దోస్తీ ఉండబోదని, ఇక యుద్దమే అంటూ కుండబద్దలు కొట్టారు.
హైదరాబాద్ నోవాటెల్ హోటల్ నందు ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన నడ్డా.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎన్నికల సన్నద్దతపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ లైన్ దాటి ఎవ్వరూ మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ తో రాజీలేదనీ.. ఆ పార్టీతో సీరియస్ ఫైట్ ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు. తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్టు లో నడ్డాకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. నడ్డాతో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందనరావు, ముఖ్య నేతలు విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మురధీర్ రావు, తదితరులు ఉన్నారు. కాగా నడ్డా తెలంగాణ పర్యటనకు బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, కొమటిరెడ్డి రాజగోపాల్ లు దూరంగా ఉన్నారు. వీరు ఢిల్లీ లో నిన్న అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇవేళ కూడా వారు ఢిల్లీలో ఉన్నారు. ఈటల, కోమటిరెడ్డిల వ్యవహారం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.
Nellore: ఎమ్మెల్యే ‘ఆనం’కు అనిల్ కుమార్ యాదవ్ బస్తీ మే సవాల్