Nellore: వైసీపీ బహిష్కృత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మాజీ మంత్రి, నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. బస్తీ మే సవాల్.. నెల్లూరు సిటిలో పోటీ చేస్తావా.. దమ్ముంటే టికెట్ తెచ్చుకుని రా అంటూ అనంకు అనిల్ సవాల్ చేశారు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు .. లోకేష్ పాదయాత్రలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని అన్నారు అనిల్ కుమార్. జగన్ చరిష్మాతో గెలిచి .. రాజీనామా చేయ్యకుండా ఉండటానికి ఉండటానికి సిగ్గు ఉండాలన్నారు. అనం మీద తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు.

అనం రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడే ఆయన రాజకీయం క్లోజ్ చేస్తానని అలా చేయని పక్షంలో రాజకీయాల నుండి వైదొలుగుతానని స్పష్టం చేశారు. నెల్లూరు సిటీని ఎంత అభివృద్ధి చేశానో.. టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చకూ తాను సిద్దమని పేర్కొన్నారు. బీదా రవిచంద్రపైనా విమర్శలు చేశారు అనిల్ కుమార్. ఒక్క సారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని బీదా తనపై విమర్శలు చేయడం సిగ్గు చేటని అన్నారు. టీడీపీ హయాంలో కావలిలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్దమా అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము బీదా రవిచంద్రకు లేదని విమర్శించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఆ పార్టీని నాశనం చేశాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ టికెట్ ఇవ్వకపోయినా తట్టుకునే గుండె తనకు ఉందని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. టికెట్ ఇస్తానంటే పారిపోయే పిరికివాడు బీదా రవిచంద్ర అని అన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
అనం రామనారాయణ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి టీడీపీ అభ్యర్ధి గెలుపునకు కారణం అయ్యారని భావించి ఆనం రామనారాయణరెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ నుండి సస్పెండ్ వేటుపడిన ఆనం టీడీపీకి దగ్గర అయ్యారు. అధికారికంగా టీడీపీలో అయితే చేరలేదు కానీ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని పేర్కొంటున్నారు అనం.