కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ఆ ప్రభావం తెలంగాణ పైనా పడుతోంది. కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని భావించారు. అయితే ఫలితాల్లో బీజేపీ దెబ్బతిని కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం ఏర్పడింది. కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరదామనుకున్న నేతలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమైంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి ఓ సీనియర్ నాయకులు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమైనట్లు వార్తలు వినబడుతున్నాయి.
చాలా కాలంగా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తన తనయుడు రాకేష్ రెడ్డితో కలిసి పార్టీని వీడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్సీ దామోదరరెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధర్ రెడ్డిల తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. నియోజకవర్గ అధికార యంత్రాంగంలో దామోదరరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదు. ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతోంది. రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి తన కుమారుడు రాకేష్ రెడ్డి ని పోటీకి నిలపాలని ఎమ్మెల్సీ దామోదర రెడ్డి భావిస్తుండగా, బీఆర్ఎస్ లో టికెట్ దక్కే అవకాశాలు లేవు. దీంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ దామోదరరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా కూడా వార్తలు వినబడ్డాయి.
అయితే దామోదరరెడ్డి శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవితో భేటీ కావడంతో దామోదరరెడ్డి మరల సొంత గూటికి వెళ్లడానికి సిద్దమైయ్యారని అంటున్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన దామోదరరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాకుండా కొత్తగా పార్టీలోకి చేరిన నాగం జనార్ధన్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆగ్రహించి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండు సార్లు ఎమ్మెల్సీగా దామోదరరెడ్డి ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కే అవకాశం లేకపోవడం, ఎమ్మెల్యేతో పడకపోవడం తో దామోదరరెడ్డి తన కుమారుడితో కలిసి సొంత గూటికి వెళ్లడానికి డిసైడ్ అయ్యారని వార్తలు వినబడుతున్న తరుణంలో మల్లు రవితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే నాగం జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు సీటు ఆశిస్తుండగా, ఆయనను కాదని దామోదరరెడ్డి కుమారుడికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందా లేక ఇంకా ఏదైనా హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటారా అనేది వేచి చూడాలి.