BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటూ ప్రచారం జరిగింది. ఇదే సందర్భంలో పలు మార్లు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర పెద్దలతో ఈటల రాజేందర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరో పక్క ఈటల రాజేందర్ వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ఊహగానాలు బలం చేకూరుతున్నాయి. మరో మారు బండి సంజయ్ మార్పు వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ లోపుగా బీజేపీలో మార్పులు, చేర్పులు జరగనున్నాయనీ, బండిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని, అధ్యక్ష బాధ్యతలు డీకే అరుణకు అప్పగిస్తారని, ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తారంటూ మరో ప్రచారం జరిగింది.
జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. తనను మార్చే ఉద్దేశం పార్టీ అధిష్టానంకు లేదని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. కార్యకర్తలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు తాము పని చేస్తామని, వారి ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేవారి పేర్లు ముందే బయటికి రావని అన్నారు. పార్టీ అధిష్టానం ఎక్కడ పని చేయమన్నా చేయడానికి సిద్దమనీ, ఇంట్లో కూర్చోమన్నా కుర్చుంటానని అన్నారు బండి సంజయ్.
ఇదే సందర్భంలో బీజేపీ – టీడీపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంపైనా క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని వ్యాఖ్యానించిన బండి.. ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇతర పార్టీల నుండి నేతలు వస్తారని తాము ఎదురు చూడమనీ అన్నారు. రాష్ట్రంలో తమ పోటీ బీఆర్ఎస్ తోనేనని చెప్పారు. కేసిఆర్ చేయించుకున్న సర్వేలో బీజేపీ గ్రాఫ్ పెరిగినట్లు తెలిసిందనీ, అందుకే కాంగ్రెస్ ను బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
Vijayawada: కారు ఢీకొని యువకుడు మృతి