KCR: కేసిఆర్ సర్కార్ పై గత కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాజాగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం రూ.5,రూ.10లు తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యాట్ ట్యాక్స్ రూ.5 మేర తగ్గించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాదిరిగానే కేసిఆర్ సర్కార్ కూడా పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో పాటు ధాన్యం రైతుల సమస్యలపైనా కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి కేంద్రంపై, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం రోజుకు ఒక మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెబుతున్నామన్నారు. వేరుశనగ, చిరు ధాన్యాలతో మంచి లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు తిసుకుంటామంటే రాష్ట్రం అడ్డుకుంటుందా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర అనేక అభ్యంతరాలు పెడుతోందని కేసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం కరాఖండిగా చెబుతోందని అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అత్యంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు వరి పంటనే వేయండి, ప్రభుత్వం మెడలు వంచి పంటను కొనిపిస్తామని అంటున్నారనీ, ఎవరి మెడలు వంచుతారు, ఆయనే మెడలు వంచుకుంటారా, లేక కేంద్రం మెడలు వంచుతారా, ఈయన ఓ ఎంపీ, చాలా రోజుల నుండి చూస్తున్నా ఆయన ఇలాగే మాట్లాడుతున్నాడు. కానీ క్షమిస్తున్నా, నా స్థాయికి తగిన మనిషి కాదు, నాకంటే చిన్న వాడు, నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, కుక్కలు మొరుగుతున్నాయని పట్టించుకోలేదు ఏడేళ్లుగా రైతుల కోసం చేస్తున్న కృషిని దెబ్బతీసేలా వ్యవహరిస్తుండటంతోనే స్పందించాల్సి వస్తుందని అన్నారు.
KCR: చమురు ధరలపై మొత్తం సెస్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై అధ్భుతమైన పద్ధతిలో అబద్దం చెప్పిందన్నారు. బీజేపీ 2014 లో అధికారంలోకి వచ్చింది, అప్పటి నుండి అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లు మించలేదని అన్నారు. ఓ సారి చమురు ధరలు కుప్పకూలి 30 డాలర్లకు కూడా పడిపోయిందన్నారు. బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, రష్యాలోనూ అలాంటి పరిస్థితే వచ్చిందని వివరించారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా ధర పెరిగిందని అబద్దాలు చెప్పిందని ఆరోపించారు. రాష్ట్రాల వాటా ఎగొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా దాన్ని సెస్ రూపంలోకి మార్చారని వివరించారు. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారని అందుకే ఈ రోజు ఏపి సీఎం ఏకంగా పత్రికా ప్రకటన కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు పెట్రోల్ ధర రూు.77 ఉంటే దాన్ని 114 లు చేశారు. డీజిల్ ధర రూ.68 లు ఉంటే 107 చేశారు. ఈ పెరుగుదుల మొత్తం కేంద్రమే తీసుకుంటూ రాష్ట్రాల నోరు కొడుతుందని విమర్శించారు. ప్రజలకు అబద్దాలు చెబుతూ మోసం చేస్తూ భారం మోపుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లీటరుకు 35 రూపాయలు పెంచి పిసరంత తగ్గించి ఇదే ఓ ఘన కార్యం అన్నట్లు చెప్పుకుంటున్నారన్నారు. చమురు ధరలపై మొత్తం సెస్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలని కేసిఆర్ డిమాండ్ చేశారు. దేశంలో రేపటి నుండి అగ్గిపెడతాం, ఇప్పటి వరకూ చాలా మర్యాదగా ప్రవర్తించామ్, వ్యక్తిగతంగా మాట్లాడినా ఏమి స్పందించలేదు, ఇక ఊరుకునేది లేదని కేసిఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఉన్నాయా
తెలంగాణలో అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం లాంటి సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని కేసిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఆర్ధిక ప్రగతిని వివరించిన కేసిఆర్ .. ఇకపై కేంద్రానికి చుక్కలు చూపిస్తామని, నిద్ర పోనివ్వమని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇష్టమొచ్చినట్లుగా అబ్బద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రానికి అల్టిమేటం ఇచ్చిన కేసిఆర్.. ఉత్తర భారతదేశంలో రైతుల ఆందోళనకు మద్దతుగా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కేసిఆర్ ఫైర్ అయ్యారు. తనను జైలుకు పంపుతామని బండి సంజయ్ అంటున్నాడనీ, అంత ధైర్యం ఉన్న వాళ్లు ఎవరని కేసిఆర్ ప్రశ్నించారు. టచ్ చేస్తే తన పవర్ ఏమిటో తెలుస్తుందని కేసిఆర్ అన్నారు. నాలుగ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మెడలు విరుస్తామని హెచ్చరించారు.