Breaking: ప్రజా యుద్దనౌక గద్దర్ ఇక లేరు. గద్దర్ ఇవేళ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండె పోటుతో కొద్ది రోజుల క్రితం అమీర్ పేట లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరిన గద్దర్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహరా పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఈ నెల మూడవ తేదీన గద్దర్ కు బైపాస్ సర్జరీ జరగ్గా కోలుకుంటున్నట్లుగా కనిపించారు.
అయితే ఊరిపితిత్తులు, యురినరీ సమస్యలతో గద్దర్ బాధపడుతుండటంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, కొద్ది సేపటికే కన్నుమూశారు. గద్దర్ మరణంతో సికింద్రాబాద్ భూదేవి నగర్ లోని ఆయన నివాసం వద్దకు బంధువులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. గద్దర్ మృతితో భూదేవి నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజా యుద్దనౌక గా పేరు పొందిన గద్దర్ .. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. గద్దర్ మృతికి వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలియజేస్తున్నారు.
గద్దర్ తూప్రాన్ లో 1949 లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. నిజామాబాద్, హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆయన 1975 లో కెనరా బ్యాంక్ లో ఉద్యోగం చేరారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల ఉన్నారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. మరీ ముఖ్యంగా 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
భావ వ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. దీని కొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శన ను చూసిన సినిమా దర్శకుడు బి నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట అపర రిక్షా రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. ‘అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపు తెచ్చాయి. మా భూమి సినిమాలో వెండి తెరపై కనిపించిన గద్దర్ పాడిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటకు నంది అవార్డు లభించింది. అయితే ఆ అవార్డును ఆయన తిరస్కరించారు.
పుంగనూరు ఘటనలో ఏ 1 గా చంద్రబాబు