విద్యుత్ సంస్థల యాజమాన్యంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు, మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జేఏసీ, ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ ఎదుట మహా ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మహా ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) కాంతిరాణా టాటా స్పందించారు.
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మహా ధర్నాకు పోలీస్ అధికారుల వద్ద నుండి లేదా ప్రభుత్వం నుండి ఏ విధమైన అనుమతులు లేవని ఆయన తెలిపారు. విజయవాడ నగరంలో సెక్షన్ 144 సిఆర్.పి.సి. మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని తెలిపారు. నిషేదాజ్ఞల కారణంగా ధర్నా కార్యక్రమమునకు అనుమతులు నిరాకరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ESMA (ఎస్మా) ఎస్సేన్సియల్ సర్వీసెస్ మెయిన్టినేన్స్ యాక్ట్ అమలులో వున్నదని తెలిపారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎస్సేన్సియల్ సర్వీసెస్ కావున ఎస్మా చట్టం అమలులో వుంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.నెంబరు 54 ద్వారా అన్ని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ల యందు ఎస్మా చట్టాన్ని ఉదహరిస్తూ సదరు ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ నందు ఉన్న మూడు ట్రాన్స్మిషన్ కంపెనీలు అనగా APEPDCL, APSPDCL & APCPDCL, మరియు AP GENCO లలో పనిచేయు వారు ఎటువంటి సమ్మెలను చేయకుండా తేది.10.05.2023 నుండి ఆరు నెలలపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని తెలిపారు. కావున ఎవరైనా ఈ ధర్నాలో పాల్గొంటే వారిపై ఎస్మా చట్టం క్రింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా ఎవరైతే నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తారో వారిపై ఐపీసీ ప్రకారం సెక్షన్ 143, 427, 452, 283, 341, 506, 120(B), R/W 149 క్రింద మరియు పి.డి.పి.పి.చట్టం (Prevention of Damage to Public Property Act) సెక్షన్ 3 క్రింద కఠిన చర్యలు మరియు ఆంద్రప్రదేశ్ కండక్ట్ రూల్స్ ప్రకారం శాఖా పరమైన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
తమకు తెలిసిన సమాచారం ప్రకారం కొంత మంది బయటి వ్యక్తులు ఈ ధర్నా కార్యక్రమములో చేరి హింసకు పాల్పడే అవకాశం కలదన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయని చెప్పారు. నగరంలో రెండు వేల మంది పోలీస్ సిబ్బంది, సి.సి.కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, వీడియో గ్రఫి మొదలగు వాటి ద్వారా పటిష్టమైన నిఘా పెట్టి, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి విజయవాడ వైపు వచ్చు వాహనాలు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని సీపీ తెలిపారు.
Breaking: ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు