YS Jagan: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వ్యవసాయ పంటలు ముంపునకు గురి అయ్యాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అధికారులు అందించిన సహాయ చర్యలు, వరద సాయం అందిందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకోనున్నారు. రెండు రోజుల సీఎం జగన్ పర్యటన షెడ్యుల్ వివరాలు ఈ విధంగా..
రేపు 7వ తేదీ (సోమవారం) ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏఎస్ఆర్ జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. అక్కడ గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్స్టాండ్ సెంటర్లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ ఆర్ అండ్ బీ అతిధి గృహంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఎల్లుండి (మంగళవారం) ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి బయలుదేరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత తానేలంక రామాలయంపేట గ్రామం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఏపీ విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాకు సర్కార్ బిగ్ షాక్ .. ఎస్మా చట్టం కింద చర్యలు అంటూ హెచ్చరిక