Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ (BJP) అభ్యర్ధి ఈటల రాజేందర్లీ (Etela Rajender) డ్ లో ఉన్నారు గెలుపు దిశగా రౌండ్ రౌండ్ కు మెజార్టీ నమోదు అవుతోంది. కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్యర్ధి వెంకట్ బల్మూరు కు 5వేలకు మించి ఓట్లు వచ్చే పరిస్థితి కనబడటంలేదు. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయే పరిస్థిత నెలకొంది. దీంతో హూజూర్నగర్ ఫలితాన్ని పురస్కరించుకుని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడితే అది ఈటలకు మైనస్ గా మారి అధికార టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని భావించిన విషయం తెలిసిందే. అందుకే స్థానికులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా స్థానికేతరుడికి టికెట్ కేటాయించారు.
Huzurabad By Poll: క్యాడర్ ఉన్నా ఓట్లు వేయించుకోలేకపోయాం
దీన్ని పురస్కరించుకున్న టీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ హూజూరాబాద్ లో ఈటల 30వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు. టీఆర్ఎస్ కు ఈటల పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డిందన్నారు. అయిదు నెలల క్రితమే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయలేదన్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటలకు అక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. హూజూరాబాద్ ఎన్నికలను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల క్యాడర్ ఉన్నా ఓట్లు వేయించుకోలేకపోయామన్నారు. ఇక్కడి వాస్తవ పరిస్థితులను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళతామన్నారు.
వెంకట్ బల్మూరును బలిపశువు ను చేశారు
మరో సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కలు బల్మూర్ వెంకట్ ను హజూరాబాద్ ఎన్నికల్లో బలిపశువు ను చేశారని విమర్శించారు. డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో, గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా అని ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్దంగా ఉంటారని అన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హూజూరాబాద్ ఫలితాలు ఊహించిన విధంగానే వస్తున్నాయన్నారు. తనను మంత్రి వర్గం నుండి కేసిఆర్ అప్రజాస్వామిక పద్దతిలో తొలగించిన విషయాన్ని ఈటల రాజేందర్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారనీ అందుకే ఆయనపై సానుభూతి వచ్చిందన్నారు. హూజూరాబాద్ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదని అన్నారు. ఈటెల గెలుపును బీజేపీ గెలుపు గా బండి సంజయ్ చెప్పుకోవడం సరికాదని అన్నారు. వాస్తవరం చెప్పాలంటే.. ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదనీ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ సొంతంగా ప్రచారం చేసుకున్నారనీ, బీజేపీ అభ్యర్ధినని ఎక్కడా చెప్పుకోలేదన్నారు. ఇది ముమ్మాటికీ ఈటల వ్యక్తిగత విజయమేనని స్పష్టం చేశారు.