KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు అందరూ బిజీబిజీగా ఉన్నారు. అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయాపార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ సోషల్ మీడియాను ప్రచారానికి ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. తమ పార్టీ ఘనత, చేస్తున్న పనులు చెప్పుకోవడంతో పాటు ప్రత్యర్ధి పార్టీలోని లోపాలను జనాలకు ఎక్కువ రీచ్ అయ్యేందుకు సోషల్ మీడియా ఒక సాధనంగా మారింది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తమ పార్టీ ప్రచారానికి వినూత్నంగా ఆలోచించారు. సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు కేటిఆర్. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ యాసతో సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన మై విలేజ్ షో (గంగవ్వ) టీమ్ తో ఓ కార్యక్రమం చేపట్టారు కేటిఆర్. ఈ కార్యక్రమంలో భాగంగా కేటిఆర్ స్వయంగా గంగవ్వ టీమ్ తో కలిసి కోడి కూర వండి .. పచ్చటి పంట పొలాల నడుమ దావత్ చేసుకున్నారు. ఈ సందర్బంగా కేటిఆర్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను గంగవ్వ టీమ్ తో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఇంతకు ముందు కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో గంగవ్వకు తన మై విలేజ్ షో ఛానల్ కు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు కేటిఆర్. ఆ హామీ మేరకు కేటిఆర్ .. మై విలేజ్ షో కు వెళ్లారు. పచ్చటి పొలాల నడుమ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేటిఆర్ వెళ్లగా, గంగవ్వ అండ్ టీమ్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. వారితో కలిసి కేటిఆర్ స్వయంగా నాటు కోడి కూర, గుడాలు, బగార అన్నం వంట చేయడం, గంగవ్వతో ముచ్చట్లు మొత్తం కార్యక్రమం వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఈ కార్యక్రమంలో భాగంగా గంగవ్వ.. ఏమనుకోవద్దు అంటూనే కేటిఆర్ ను వ్యక్తిగత కుటుంబ విషయాలపై ప్రశ్నలు అడిగింది. కేసిఆర్ తో ఎప్పుడైనా గొడవలు జరిగాయా..? కేసిఆర్ ను ఏమని పిలుస్తావ్ ..? కవితతో అనుబంధం ఇలా అనేక విషయాలను గంగవ్వ ప్రశ్నించగా, వాటికి సమాధానాలు ఇచ్చారు కేటిఆర్. ఓ పక్క వంట చేస్తూనే.. మధ్యమధ్యలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్న కేటిఆర్.. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు కేటిఆర్.
మొత్తం మీద కేటిఆర్ నాటు కోడి కూరతో బగారా అన్నంతో గంగవ్వ టీమ్ తో కలిసి సరదా సరదా ముచ్చట్ల చెప్పుకుంటూ జబర్దస్త్ దావత్ చేసుకున్నారు. ఈ ముచ్చట్ల మధ్యే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకున్నారు కేటిఆర్. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వినూత్నంగా ప్రచారం చేయడంలో మంత్రి కేటిఆర్ ను మించిన వ్యక్తి లేడంటూ కామెంట్స్ చేస్తున్నారు.