Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) ఇక లేరు. వయోభారంతో కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లు స్వరాజ్యం ఈ రోజు తుది శ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం తన 13 సంవత్సరాల వయసులోనే సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నాటి సాయుధ పోరాటంలో తుపాకీ చేతపట్టిన తొలి మహిళా మల్లు స్వరాజ్యమే. మల్లు స్వరాజ్యం అంత్య క్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు సీపిఎం నేతలు తెలిపారు.
1931లో కొత్తగూడెంలో జన్మించిన మల్లు స్వరాజ్యం.. వామపక్ష దిగ్గజ నేత భీంరెడ్డి నర్శింహరెడ్డికి స్వయానా సోదరి. అన్న భీంరెడ్డి నర్శింహరెడ్డితో కలిసి పేదల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్న స్వరాజ్యం.. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. అప్పట్లోనే ఆమె తలపై పదివేల రివార్డు ప్రకటించారు. తన ఉద్యమ సహచరుడైన మల్లు వెంకట నర్సింహారెడ్డి ని వివాహం చేసుకున్నారు. నా మాటే తుపాటి తూటా పేరిట ఆత్మకథ కూడా రాశారు. రాజకీయాల్లో ప్రవేశించిన మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నుండి 1978, 83 లో రెండు సార్లు సీపిఎం నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. 1985, 89 లో ఓడిపోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు. సీపీఎం పార్టీ లో అఖిల భారత ఉపాధ్యక్షురాలిగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అనేక కీలక పదవుల్లో కొనసాగారు. సీపీఎం కేంద్ర కమటీ నుండి ప్రత్యేక ఆహ్వానితురాలిగా కొనసాగారు. ఆమె భర్త మల్లు వెంకట నర్శింహరెడ్డి అనారోగ్యంతో 2004 లో మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మల్లు గౌతమ్ రెడ్డి హోమియోపతి వైద్యుడుగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మిర్యాలగూడ సీపీఎంలో చురుగ్గా పని చేస్తున్నారు. కుమార్తె పాదూరి కరుణ. ఈమె 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున నల్లగొండ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓడి పోయారు. రెండవ కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి ప్రస్తతం సూర్యపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మల్లు స్వరాజ్యం మృతి పట్ల సీఎం కేసిఆర్ తో సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు సంతాపం తెలియజేశారు. ఆమె పోరాట స్పూర్తిని నేతలు కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఆమె భౌతికయాన్ని రేపు ఉదయం 6 గంటలకు సీపిఎం కార్యాలయానికి తీసుకువెళతారు. ఉదయం పది గంటల వరకూ కార్యకర్తల సందర్శనార్ధం అక్కడే ఉంచుతారు. అనంతరం నల్లగొండకు తరలిస్తారు. నల్లగొండలో జరిగే ఆమె అంత్యక్రియలకు సీపీఎం జాతీయ కౌన్సిల్ సభ్యులు హజరు అవ్వనున్నారు.