మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో పలువురు మేడ్చల్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఓ వివాహా వేడుకలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి మద్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఈ తరుణంలో మైనంపల్లి నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు చేరుకున్నారు. వీరు దాదాపు రెండు గంటలకుపైగా సమావేశం అయ్యారు. అయితే తమ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదనీ, బ్రేక్ ఫాస్ట్ మీటింగేనని మైనంపల్లి అంటున్నారు.
జిల్లా నుండి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇతర ఎమ్మెల్యేలు చెప్పిన పనులు తనకు తెలియకుండా చేయవద్దని మేడ్చల్ కలెక్టర్ కు మంత్రి మల్లారెడ్డి సూచించారనీ, దీనిపై మైనంపల్లి ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఆ నేపథ్యంలో వీరంతా భేటీ అయ్యారనీ భావిస్తున్నారు. గతంలో మంత్రి మల్లారెడ్డి ఇతర ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉన్నప్పటికీ కొంత కాలంగా తమ నియోజకవర్గాల్లో మంత్రి మల్లారెడ్డి జోక్యం ఎక్కువగా ఉందని వారు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై చర్చించి జిల్లాలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకువాలని వీరు భావిస్తున్నారని అందుకే ఈ రహస్య భేటీ అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలను మైనంపల్లి ఖండిస్తున్నారు.