ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు నేడు హజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ నోటీసులు అందుకున్న పైలట్ రోహిత్ రెడ్డి ఈ రోజు విచారణకు హజరు అవుతున్నట్లుగా ముందుగా ప్రకటించారు. ఈడీ నోటీసు అందిన తర్వాత ఒక పర్యాయం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ తో భేటీ అయి ఈ అంశంపై చర్చించిన పైలట్ రోహిత్ రెడ్డి .. ఈ రోజు తన నివాసం నుండి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. అయితే ఈడీ కార్యాలయం వెళ్లకు ముందే ప్రగతి భవన్ కు చేరుకుని సీఎం కేసిఆర్ తో మరో సారి భేటీ అయ్యారు. ఇదే సమయంలో న్యాయనిపుణులతో సంప్రదించినట్లుగా కూడా తెలిసింది. సీఎం భేటీ అనంతరం నేటి ఈడీ విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. విచారణకు హజరయ్యేందుకు మరి కొంత సమయం కావాలని ఈడీకి లేఖ రాశారు రోహిత్ రెడ్డి.
రోహిత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఆర్ధిక వ్యవహారాలు, స్థిర చరాస్తులు, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు, ఇలా మొత్తంగా కావాల్సిన సమాచారానికి తీసుకోవాలని రోహిత్ రెడ్డి కి ఈడీ కోరింది. దీంతో మొత్తం సమాాచారం తీసుకువచ్చేందుకు మరి కొంత సమయం కావాలని కోరుతూ ఈడీకి లేఖ పంపారు రోహిత్ రెడ్డి. ఇడీ ఇచ్చిన ఫ్యార్మట్ లో మొత్తం వివరాలు అందజేయాలంటే సమయం కావాలని కోరినట్లు చెబుతున్నారు. ఈ మేరకు తన పీఏ ద్వారా లేఖ పంపినట్లు సమాచారం. జనవరి 20వ తేదీ తర్వాత అయితే విచారణకు హజరు అవుతానని కూడా లేఖలో రోహిత్ రెడ్డి పేర్కొన్నట్లుగా తెలుస్తొంది. దీనిపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ కార్యాలయం వద్దకు విచారణకు బయలుదేరిన రోహిత్ రెడ్డి .. సీఎం నుండి సమాచారం రావడంతో ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసిఆర్ తో భేటీ అయ్యారని, ఆ తర్వాతనే తన నిర్ణయాన్ని మార్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.