పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సొంత క్యాడర్ ను డవలప్ చేసుకుంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తమ వర్గం ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ పార్టీ మార్పుపై స్పష్టమైన వైఖరి తెలియజేశారు కానీ, ఏ పార్టీ లోకి వెళతారు అనేది మాత్రం ఇంత వరకూ వెల్లడించలేదు.
తొలుత కాంగ్రెస్, బీజేపీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీ చేరబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన వర్గీయులందరికీ రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవాలంటే అది వైఎస్ఆర్ టీపీలో చేరితేనే సాధ్యం అవుతుంది. బీజేపీలో చేరితే కొంత మందికి మాత్రమే సీట్లు ఇప్పించుకునే అవకాశం కలుగుతుంది. పొంగులేటి జిల్లాలో తన వర్గీయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడంతో వేరే జిల్లాలో అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారని టాక్.
ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోనూ పొంగులేటి మాట్లాడారు. పార్టీ అధిష్టానంపై మూడేళ్లుగా జూపల్లి అసంతృప్తిగా ఉన్నారు. పొంగులేటి, జూపల్లి ఇద్దరూ నిన్న కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో కేసిఆర్ పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పార్టీ అధిష్టానం స్పందిస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. పొంగులేటితో పాటు జూపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్.
జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్ధన్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత హర్షవర్ధన్ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంతో జూపల్లికి పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. దీంతో పార్టీపైనా, పార్టీ పెద్దలపైనా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. అయితే ఆయనను ఇంత వరకూ దూరం పెడుతూనే ఉంది కానీ సస్పెండ్ చేయలేదు. అయితే పొంగులేటితో కలవడంతో పార్టీ సీరియస్ నిర్ణయాన్ని తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి వివిధ హోదాల్లో పని చేశారు. 2013లో వైసీపీ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కొంత కాలం పని చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఖమ్మం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు పై విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ టికెట్ ఆశించినా పార్టీ అధిష్టానం నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతో ఆయన గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత ఆయనకు పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఏ పదవీ రాలేదు. ఆ నేపథ్యంలో పొంగులేటి పార్టీ మారతారంటూ కూడా ప్రచారం జరిగింది. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక అనుచరవర్గం, అభిమానులు కల్గి ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆయన ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది తెలియాల్సి ఉంది.
ఎన్ఐఏ కోర్టుకు సీఎం జగన్ కీలక వినతి .. ఆ కేసులో వ్యాంగ్మూలం నమోదు విషయంపై..