Putta Madhu: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పుట్ట మధును భీమవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. శుక్రవారం కూడా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో పుట్ట మధు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి నెలకొంది.
మూడు నెలల క్రితం హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల దారుణ హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు. పట్ట మధు సన్నిహితుడిని గతంలోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుట్ట మధును కూడా పోలీసులు విచారణ జరుపుతారనే చర్చ జరుగుతోంది.
ఇటీవల మంత్రివర్గం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు పుట్ట మధు సన్నిహితంగా ఉండటంతో పాటు వ్యాపార లావేదేవీలు నిర్వహించారనీ సమాచారం. దీంతో కేసిఆర్ ఆయనపై అసంతృప్తితో ఉన్నందునే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పుట్ట మధును భీమవరం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలించారు. అయితే పుట్ట మధును ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.